ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలుకు పంపించినా తగ్గేది లేదు,,, రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 08:40 PM

జైలుకు పంపినా తగ్గేది లేదు.. భయపడేది లేదు అని ఎంపీగా తనపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని వ్యాఖ్యానించారు. తాను ఎవరికీ భయపడనని, జైలుకు పంపించినా తగ్గేది లేదని తెలిపారు. తాను ఒకటే ప్రశ్న అడిగానని, అదానీ, మోడీ స్నేహం గురించి పార్లమెంట్‌లో మాట్లాడినట్లు చెప్పారు. అదానీ షెల్ కంపెనీలలో రూ.20 వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని, ఈ 20 వేల కోట్లు ఎవరివి? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.


అదానీ, మోదీ బంధం ఇప్పటిది కాదని, ఎప్పటినుంచో ఉందని రాహుల్ విమర్శించారు. నిబంధనలు మార్చి అదానీకి ఎయిర్‌పోర్టులు ఇచ్చారని, కేంద్రమంత్రులు పార్లమెంట్‌లో అబద్ధాలు చెప్పారని అన్నారు. తాను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానని మంత్రులు అబద్ధం చెప్పారని, తాను రెండు లేఖలు రాస్తే దానికి జవాబు లేదన్నారు. స్పీకర్‌ను కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వమంటే నవ్వి వదిలేశారని, తాను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడానని అన్నారు.


ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని రాహుల్ తెలిపారు. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా అంతా జరుగుతోందని, మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి అదానీతో స్నేహం కొనసాగుతోందన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తానని, జైలుశిక్షపై తాను ఏం మాట్లాడనన్నారు. తన తర్వాతి ప్రసంగానికి భయపడే ప్రధాని తనపై అనర్హత వేటు వేశారని, బీజేపీ నేతలంతా మోదీ అంటే భయపడతారని రాహుల్ ఆరోపించారు.


'నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్.. ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే ఇప్పుడు విపక్షాలకు ఉన్న అవకాశం. నాకు మద్దతుగా ఉన్న విపక్షాలన్నింటికి ధన్యవాదాలు. నేను ఏ ప్రశ్న అడిగినా ఆలోచించే అడుగుతాను. పార్లమెంట్ లోపల ఉన్నా, బయట ఉన్నా నా పని నేను చేసుకుంటూ పోతాను. అనర్హత వేటు ఉన్నా, లేకున్నా నా పని నేను చేసుకుంటూ పోతా. అదానీతో మా ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తేలితే వాళ్లను జైల్లో వేయండి. వేరేవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లను జైల్లో వేయండి. అదానీని మోదీ ఎందుకు రక్షిస్తున్నారని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు' అని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకుపడ్డారు.


'దేశమే అదానీ, అదానీనే దేశం అన్నట్లుగా మోదీ వ్యవహారిస్తున్నారు. నేను అడుగుతున్నదానిపై తప్పుదారి పట్టించేందుకు నాకు ఇంత శిక్ష వేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే నా పని. అదే పని చేస్తా. దొంగ దొరికినప్పుడు పక్కదారి పట్టించినట్లే, బీజేపీ కూడా అలాగే వ్యవహారిస్తోంది' అని రాహుల్ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa