ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా ద్వారా ఇటీవల విశేష గుర్తింపు సాధించిన తమిళనాడుకు చెందిన బొమ్మన్, బెల్లీ దంపతుల సంరక్షణలో ఉన్న ఏనుగు కూన మృతి చెందింది. దీంతో ధర్మపురి జిల్లాలో విషాదం నెలకొంది. 5 నెలల వయసున్న ఈ ఏనుగు పిల్ల మార్చి 16 నుంచి బొమ్మన్, బెల్లీ దంపతుల సంరక్షణలో ఉంది. ధర్మపురిలోని పోడూరు గ్రామంలో మార్చి 11న ఓ రైతుకు చెందిన 30 అడుగుల బావిలో ఈ ఏనుగు పిల్ల పడిపోయింది. గుంపు నుంచి విడిపోయి అనాథ అయ్యింది. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకొని అక్కడికి వచ్చిన అటవీ అధికారులు.. బావిలో నుంచి ఏనుగును రక్షించారు. వైద్యులు చికిత్స అందించారు.
ఆరోగ్యం కాస్త మెరుగైన తర్వాత ఆ ఏనుగు పిల్లను గుంపుతో కలిపేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. కానీ, అవి ఫలించలేదు. దీంతో దాన్ని బొమ్మన్, బెల్లీల సంరక్షణలో ఉంచేందుకు ముదుమలై టైగర్ రిజర్వ్లోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్కు తరలించారు. గుంపు నుంచి తప్పిపోయి ఆందోళనగా ఉన్న ఆ ఏనుగు కూనను సంరక్షించడంలో ఆ దంపతులే ఎక్స్పర్ట్ అని అధికారులు భావించారు.
అయితే, కొన్ని రోజులుగా ఆ ఏనుగు పిల్ల ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. గురువారం అర్ధరాత్రి తర్వాత పరిస్థితి విషమించడంతో వైద్యులు దానికి గ్లూకోజ్ పెట్టారు. కానీ, చికిత్సకు స్పందించలేదు. శుక్రవారం (మార్చి 31) ఉదయం ఆ ఏనుగు పిల్ల మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
బొమ్మన్, బెల్లీ దంపతుల సంరక్షణలో 4 నెలల మరో ఏనుగు పిల్ల ఉంది. దాని తల్లి మృతి చెందడంతో ధర్మపురి నుంచి తీసుకొచ్చి బొమ్మన్, బెల్లీ దంపతలు సంరక్షణలో ఉంచారు. అది వారితో కలిసిపోయి చలాకీగా తిరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 5 నెలల ఏనుగు పిల్ల మరణించిందనే వార్త తెలిసి సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ధర్మపురిలో మార్చి (2023) నెలలోనే మొత్తం ఐదు ఏనుగుల మృతి చెందాయి. మార్చి 18న ధర్మపురిలోని కెల్వల్లి గ్రామంలో విద్యుత్ వైరు తగిలి మగ ఏనుగు మృతి చెందింది. మార్చి 7న ధర్మపురిలోని కాళీ కవుందర్ కొట్టాయ్ గ్రామంలో మూడు ఏనుగులు విద్యుదాఘాతానికి గురయ్యాయి. అడవి పందులు పొలాల్లోకి రాకుండా ఓ రైతు ఏర్పాటు చేసిన కంచెకు తగిలి మరణించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa