ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్‌ వివేకా హత్య కేసు లో కీలక పరిణామాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 01:33 PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్‌ తుమ్మలపల్లి గంగిరెడ్డికి వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున న్యాయవాదులు నాగేంద్రన్‌, జగదీశ్‌ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేయడంతో గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ అమరావతి (ఆంధ్రప్రదేశ్‌) హైకోర్టు నుంచి ఇక్కడకు బదిలీ అయిందని.. ఇది మొదటిసారి మార్చి 23న విచారణకు వచ్చిందని.. అప్పుడు కోర్టు నోటీసులు జారీచేసినప్పటికీ గంగిరెడ్డి తరఫున ఎవరూ హాజరుకాలేదని పేర్కొన్నారు. హత్యకు గురైంది తన తండ్రి అని.. తాము అసలైన బాధితులం అయినందున తమ వాదనలు వినాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది కోరారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించాలని అభ్యర్థించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. గంగిరెడ్డికి రెండోసారి నోటీసులు జారీచేసింది. వీటిని వ్యక్తిగతంగా ఆయనకు అందజేయాలని సీబీఐకి ఆదేశాలు జారీచేసింది. గంగిరెడ్డి కోర్టుకు హాజరైన తర్వాత సునీతారెడ్డి ఇంప్లీడ్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి జస్టిస్‌ సుమలత తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa