ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఎస్సై దూషించారని మనస్తాపంతో,,ఉండిలో సెల్ టవరెక్కిన ఆటో డ్రైవర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 09:51 PM

ఓ ఏఎస్పై ప్రవర్తన కారణంగా ఆటో  డ్రైవర్ మనస్తాపానికి గురయ్యాడు.  దీంతో అతను  సెల్ టవర్ ఎక్కాడు. పశ్చిమగోదావరి జల్లా ఉండిలో ఈ ఘటన జరిగింది. గంటసేపు హైడ్రామా జరగ్గా.. తర్వాత కిందకు దిగాడు. చిన్న వంతెన కూడలి దగ్గర హైవే పక్కన ఆగిన ఆటోను ఆర్టీసీ బస్సు తాకింది. అయితే రాంగ్‌ రూట్‌లో వచ్చిన బస్సు డ్రైవర్‌ను ఏఎస్సై వదిలేశారని.. ప్రశ్నించిన తనను ఏఎస్సై అసభ్య పదజాలంతో దూషించి తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆటో డ్రైవర్ సూరి.


వెంటనే వెళ్లి మండల రెవెన్యూ కార్యాలయంలో వైర్‌లెస్‌ టవరెక్కాడు. వెంటనే గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని కిందకు దిగాలని కోరారు. ఏఎస్సై ప్రవర్తనతో మనస్తాపం చెందానని చెప్పాడు. వెంటనే ఆర్‌ఐ సూరితో మొబైల్‌లో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఆటో డ్రైవర్ ఆరోపించిన ఏఎస్సైను అక్కడికి పిలిపించారు.


ఆ వెంటనే సూరి టవర్‌పై నుంచి కిందకు దిగాడు. స్థానికుల సమక్షంలో ఆర్‌ఐ ఏం జరిగిందో ఆరా తీశారు. ఆ తర్వాత ఏఎస్సైతో మాట్లాడించారు. వివాదానికి కారణమైన నరసాపురం వెళ్తున్న నాగాయలంక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గంటపాటు హైడ్రామా నడిచింది. దీంతో బస్సులో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.


మరోవైపు ఉండికి చెందిన ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మరణం కలకలంరేపింది. భీమవరం పరిధి మెంటేవారితోటకు చెందిన అభిరామ్‌ విజయవాడ గూడవల్లిలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. మార్చి 28న పరీక్షలు ముగియగా.. అభిరామ్‌ హాస్టల్ నుంచి బయల్దేరి.. అదే రోజు సాయంత్రం స్నేహితులతో కలిసి విజయవాడలో రైలెక్కినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి చెప్పాడు. కానీ అతడు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆరా తీశారు.. కానీ ఆచూకీ దొరకలేదు.


ఇంతలో కలిసిపూడి దగ్గర ఉండి పంట కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. అది అభిరామ్‌దేనని గుర్తించారు. అభిరామ్‌ మరణంపై అనుమానాలు వ్యక్తమతున్నాయి. అతడి స్నేహితులు కూడా పొంతన లేని సమాధానలిస్తున్నారని అభిరామ్ తండ్రి అంటున్నారు. కుమారుడి మరణంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


అయితే అభిరామ్ రైలులో సింక్ దగ్గర మొహం కడుక్కునే సమయంలో.. ఆకివీడు రోడ్డు దగ్గర ఉన్న రైల్వే గేటు సమీపంలో పంట కాలువలో పడిపోయినట్లు అనుమానిస్తున్నారు. అతడ్ని రైల్లోంచి ఎవరైనా నెట్టేశారా.. ప్రమాదవశాత్తు పడిపోయాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే విజయవాడలో బయలుదేరే ముందు అభిరామ్‌ కొందరితో ఘర్షణ పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa