ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చిన మెసేజ్ కు స్పందించి... మోసపోెయాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 01, 2023, 09:52 PM

మెసేజ్ వస్తే ఎవరైనాస్పందిస్తారు.  కానీ ఏ మెసేస్ వచ్చినా ఆచితూచి స్పందించాలి. లేకపోతే కొంపకొల్లేరవుతోంది. ఓ చిన్న మెసేజ్‌కు స్పందించడమే అతడు చేసిన తప్పైంది. రూ.150 వచ్చాయని సంబరపడితే మొత్తం రూ.2.63 లక్షలు మోసపోయాడు. తిరుపతి ఎస్వీయూ ప్రాంతానికి చెందిన శేఖర్‌ అనే వ్యక్తి మొబైల్‌కు కొత్త మొబైల్ నంబరు నుంచి సమాచారం వచ్చింది. తాము పెట్టిన మెసేజ్‌కు రేటింగ్ ఇచ్చి.. దాని స్క్రీన్ షాట్ పంపిస్తే గూగుల్ పే ద్వారా కమిషన్ డబ్బులు పంపిస్తామని చెప్పారు. శేఖర్ కూడా నిజమేనని నమ్మేశాడు.. వారు చెప్పినట్లు చేశాడు. అతడికి రూ.150 కమీషన్‌ కూడా వచ్చింది.


అక్కడిత ఆగకుండా మెసేజ్ పంపిన వ్యక్తి.. ప్రీపెయిడ్‌ ట్యాగ్‌ చేస్తే కమిషన్‌ ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పాడు. శేఖర్‌ రూ.2 వేలు పంపించగా.. అతడికి రూ.2,800 పంపారు. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలైంది.. శేఖర్ నుంచి రూ.30 వేలు, రూ.63,900, రూ.80 వేలు, రూ.90 వేలు ఇలా డబ్బుల్ని దశలవారీగా వసూలు చేశారు. డబ్బులు తీసుకున్నా కమిషన్‌ పంపకపోవడంతో అతడికి ఫోన్‌ చేశాడు. మరో రూ.1.50 లక్షలు పంపితే మొత్తం రూ.4.50 లక్షలు పంపుతామని నమ్మబలికారు.


అప్పుడు శేఖర్‌ మోసపోయానని గమనించాడు.. మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని గమనించాడు. వెంటనే ఎస్వీయూ పోలీసులను ఆశ్రయించాడు. .ఈ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. మెసేజ్ పెట్టిన వ్యక్తి తమిళనాడు మధురై ప్రాంతానికి చెందిన ముత్తు పాండియన్‌గా గుర్తించారు. అతడి బ్యాంక్ అకౌంట్‌ను ఇప్పటికే 12 సార్లు ఫ్రీజ్‌ చేశారు. మళ్లీ అదే బ్యాంకు అకౌంట్‌కు డబ్బుల్ని జమ చేయించాడు. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి అకౌంట్లను ఫ్రీజ్‌ చేయించారు. ఆ అకౌంట్ నుంచి రూ.2,63,900 డబ్బులు బాధితుడికి అందజేశారు. మధురై వెళ్లిన పోలీసుల టీమ్ నిందితుడ్ని అరెస్ట్ చేశారు.


ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి.. ఆఫర్లు, స్క్రాచ్ కార్డులు, కమిషన్, కేవైసీ అంటూ అమాయకుల్ని మోసం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌‌కాల్స్, మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే, పదే హెచ్చరిస్తున్నా.. కొందరు ఇంకా మోసపోతూనే ఉన్నారు. పోలీసులు ఎక్కడికక్కడే చెక్ పెడుతున్నా సరే సైబర్ నేరగాళ్లు కూడా రోజుకో రకంగా మోసం చేస్తున్నారు. కొంతమంది అకౌంట్‌లలో నుంచి వారికి తెలియకుండానే డబ్బులు మాయమైన ఘటనలు కూడా ఇటీవల బయటపడ్డాయి. అందుకే ఇలాంటి తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. కొందరు ఉద్యోగాల పేరుతో కూడా ట్రాప్‌లోకి దించి మోసం చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa