శ్రీరామనవమి రోజున ఇండోర్ ఆలయంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గతంలో స్థానికుల ఫిర్యాదులను మున్సిపల్ అధికారులు పట్టించుకుని చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. సోమవారం ఉదయం బాలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి ఐదు బుల్డోజర్లతో చేరుకున్న మున్సిపల్, పోలీస్ అధికారులు.. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు.
కూల్చివేతను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారనే అనుమానంతో ముందస్తు చర్యలు చేపట్టారు. నాలుగు స్టేషన్ల పరిధిలోని పోలీసులను అక్కడ మోహరించారు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అక్కడకు చేరుకున్నారు.
స్థానికుల ఫిర్యాదులపై ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ చర్య తీసుకున్నట్లయితే నవమి రోజు విషాదాన్ని నివారించిగలిగేవారని దర్యాప్తులో తేలింది. కూలిపోయిన ఆలయ ప్రాంతం అక్రమ కట్టడమని గతేడాది ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. అయితే, మతపరమైన మనోభావాలు దెబ్బతింటాయని ఆలయ ట్రస్ట్ హెచ్చరించడంతో కూల్చివేతపై వెనక్కి తగ్గారు. నవమి రోజున జనం బారానికి మెట్ల బావి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు హవనం జరుగుతోంది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేట్ ట్రస్ట్ చేపట్టింది.
200 ఏళ్ల నాటి మెట్ల బావిని నాలుగు ఇనుప గజాలు, పలుచని కాంక్రీట్ వేసి, టైల్స్తో కప్పేశారు. రామనవమి నాడు పూజలు చేయడానికి వచ్చిన జనం దానిపై కూర్చోవడంతో వారి బరువును తట్టుకోలేక కూలిపోయింది. తాము కూర్చున్నది మృత్యుబావి అని జనం గుర్తించలేకపోయారు. తాజా ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన నివాసంలో ఆదివారం జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు సాంప్రదాయ పురాతన బావులు, మెట్ల బావులను గుర్తించి జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. పూడ్చకుండా మూతపడిన బావులు, మెట్ల బావుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాంటి స్థలం ఉంటే ప్రమాదం జరిగే అవకాశం లేకుండా వాటిని తెరిచి ఏర్పాట్లు చేయలన్నారు. అవసరమైతే, అటువంటి ప్రదేశాల చుట్టూ సరిహద్దు గోడలు, ఫెన్సింగ్ లేదా రైలింగ్ చేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa