ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ తీర్ధపుచ్చుకొన్న ఏ.కే.ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని

national |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 06:36 PM

న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మురళీధరన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు. అనిల్ ఆంటోనీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి.. పీయూష్ గోయల్ ఘనంగా స్వాగతం పలికారు.  బీజేపీలో చేరిన సందర్భంగా అనిల్ ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తాను ఒక కుటుంబం కోసం పనిచేస్తున్నానని నమ్ముతుంటాడు. కానీ.. నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని అనుకున్నాను. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం దేశ రాజకీయాలను అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందింది. ఇది నన్ను నిరాశపరిచింది' అని అనిల్ ఆంటోని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో భారత్‌ను అగ్రగామిగా నిలపాలన్న స్పష్టమైన దృక్పథం ప్రధాని మోదీకి ఉందన్నారు. భారతదేశం పట్ల ఆయనకున్న స్పష్టమైన దృక్పథం తనను ఎంతగానో ఆకట్టుకుందని.. ఈ కారణంగానే తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అనిల్ ఆంటోనీ స్పష్టం చేశారు.


పార్టీని వీడే ముందు అనిల్ ఆంటోనీ కేరళలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి నాయకత్వం వహించారు. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని 'భారత్ పట్ల పక్షపాతం' అని వాదించిన అనిల్ ఆంటోనీ.. నిషేధం ఉన్నప్పటికీ దాన్ని ప్రసారం చేయడం ద్వారా కాంగ్రెస్ భారత రాజకీయాల్లో ప్రతిపక్షాల ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ దేశం కోసం కాకుండా.. కుటుంబం కోసం పనిచేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వం ఒక కుటుంబం చేతిలో ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ, బీజేపీపై కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు చాలా బాధాకరమని అనిల్ ఆంటోనీ వ్యాఖ్యానించారు.


ప్రధాని మోదీ పనితీరు కారణంగా.. ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం గొప్ప స్థానంలో ఉందని అనిల్ అభిప్రాయపడ్డారు. భారతదేశం అభిప్రాయాలు ఇప్పుడు ప్రపంచ వేదికపై మరింత గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు. అదే సమయంలో దేశం పట్ల బీజేపీ దేశభక్తితో వ్యవహరిస్తోందని అనిల్ ఆంటోనీ చెప్పారు. అనిల్‌ ఆంటోనీని పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. అనిల్‌ ఆంటోనీ బహుముఖ వ్యక్తిత్వం, ఆయన అర్హతలు ఎంతగానో ఆకట్టుకున్నాయని పొగిడారు. అనిల్‌ ఆంటోనీ రాకతో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని పీయూష్‌ గోయల్‌ అభిప్రాయపడ్డారు.


గుజరాత్ మత అల్లర్లకు సంబంధించి.. వివాదాస్పద డాక్యుమెంటరీ 'ది మోదీ క్వశ్చన్' ప్రసారాన్ని వ్యతిరేకించిన అనిల్ ఆంటోనీ.. డాక్యుమెంటరీ ప్రసారంపై నిషేధం ఉన్నప్పటికీ దానిని ప్రసారం చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టడం ప్రజాస్వామ్యానికి హానికరం అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనిల్ ఆంటోనీ ప్రకటనను ఖండిస్తూ.. కేరళ కాంగ్రెస్ మైనారిటీ విభాగం ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa