రైలులో తోటి ప్రయాణికుడితో గొడవపడి ఆగ్రహంతో పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడ్ని ఢిల్లీ షహీన్బాగ్కు చెందిన షారుఖ్ సైఫీగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు ఘటన తర్వాత పరారైన నిందితుడి కోసం కేరళ పోలీసులు, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) సంయుక్తంగా గాలింపు చేపట్టి అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని రత్నగిరిలో అరెస్ట్ చేశారు. నిందితుడు సైఫీ ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే అతడి గురించి తెలిసినవారు షాకవుతున్నారు. నిరాడంబరంగా ఉండే సైఫీ.. తన పనేదో తాను చూసుకునేవాడని, ఎవరితో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని అంటున్నారు.
కుటుంబానికి కూడా అతడి సంఘవిద్రోహ ప్రవృత్తి గురించి కించెత్తు అనుమానం కలగలేదు. ఎప్పుడూ ఢిల్లీ దాటి బయటకు వెళ్లని సైఫీ.. మార్చి 31 నుంచి కనిపించకుండా పోయాడు. దీనిపై సైఫీ తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. సైఫీ ఉన్నాడా? లేడా? అని తెలుసుకోడానికి మంగళవారం ఉదయం 10 గంటలకు తమ ఇంటికి పోలీసులు వచ్చారని కుటుంబ సభ్యుడు ఒకరు వెల్లడించారు. ‘బుధవారం మళ్లీ వచ్చి అరెస్టు గురించి మాకు చెప్పి, సైఫీ గదిని శోధించారు.. కొన్ని పత్రాలను తీసుకెళ్లారు’ అని పేర్కొన్నారు.
అలప్పూజ రైలు ఘటన తర్వాత సైఫీ ఇంటిపై పోలీసులు అనేకసార్లు దాడులు నిర్వహించారు. ఢిల్లీ పోలీసులు సైతం సైఫీ గురించి ఆరా తీసి, అతడి నెట్వర్క్ను గుర్తించడం ప్రారంభించారు. షహీన్ బాగ్లోని ఎఫ్సీ బ్లాక్లోని మూడు గదుల ఇంటిలో తన తల్లిదండ్రులు, నానమ్మ, ఇద్దరు సోదరులతో సైఫీ కలిసుంటున్నాడు. తండ్రి ఫక్రూద్దీన్ మాట్లాడుతూ.. నా కొడుకు ఎప్పుడూ ఢిల్లీ దాటి వేరే రాష్ట్రానికి వెళ్లలేదని, అటువంటి తీవ్రమైన నేరం చేశాడంటే తమ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.
‘‘మేము గత 15 ఏళ్లుగా షహీన్ బాగ్లో ఉంటున్నాం.. షారుఖ్ సైఫీ ఢిల్లీ దాటి ఎప్పుడూ బయటకు వెళ్లలేదు.. వాడికి చాలా సిగ్గు.. కుటుంబసభ్యులతో తప్పా ఇతరులతో పెద్దగా కలవడు’’ అని చెప్పారు. నొయిడా సెక్టార్ 31లోని నిథారీ గ్రామంలో ఉన్న తమ కార్పెంటరీ దుకాణానికి తండ్రితో కలిసి రోజూ వెళ్లేవాడు. అయితే, మార్చి 31న తాను దుకాణానికి ఆలస్యంగా వస్తానని చెప్పాడని ఫక్రూద్దీన్ తెలిపాడు.
సైఫీ బంధువు రసూలా మాట్లాడుతూ..‘శుక్రవారం ఉదయం దుకాణానికి వెళ్లకపోవడంతో మరో కుమారుడు ఫరూక్కి ఫక్రూద్దీన్ ఫోన్ చేసి అడిగితే అప్పటికే బయలుదేరాడని చెప్పారు.. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.. మూడు రోజుల పాటు అతడు ఎక్కడున్నదీ ఆచూకీ తెలియకపోవడంతో ఏప్రిల్ 2న పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు.. బుధవారం మహారాష్ట్రలోని రత్నగిరిలో అరెస్ట్ అయినట్టు తెలిసింది.. మరో రాష్ట్రానికి అతడు ఎలా వెళ్లాడో తెలియదు.. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా తీసుకెళ్లలేదు’ అని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ వరకూ చదువుకున్న సైఫీ.. అనంతరం తనకు కార్పెంటరీ దుకాణంలో సాయంగా వస్తుండేవాడని అన్నారు. తన కుమారుడికి ఏ గ్రూప్తో లేదా పార్టీతో సంబంధం లేదు.. ఎలాంటి నేర చరిత్ర కూడా లేదు.. ఎప్పుడూ సాధారణంగా ప్రవర్తించేవాడు అని ఫక్రూద్దీన్ తెలియజేశాడు.
ఆ ప్రాంతంలోని స్థానికులు సైఫీ ఎవరితో కలవడని, ఒంటరిగా ఉండేవాడని చెబుతున్నారు. ఎవరితోనూ మాట్లాడటం తాము చూడలేదని, దుకాణానికి వెళ్లేటప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చేవాడని పేర్కొన్నారు. ఇతర యువకుల మాదిరిగా అనవసరంగా తిరగడం, వేరే వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడటం తాను ఎప్పుడూ చూడలేదని, అతడ్ని అరెస్టు చేశారని విని షాక్ అయ్యానని ఫహీమ్ అనే వ్యక్తి అన్నారు. తాను ఇక్కడ గత 14 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నానని, సైఫీ తనతో ఎప్పుడూ మాట్లాడలేదని సర్ఫరాజ్ అనే మరో వ్యక్తి చెప్పారు. అతనిని ఎప్పుడూ చూడలేదని చెప్పుకునే వారు ఇంకా చాలా మంది ఉన్నారు.
ఆదివారం రాత్రి అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు కోజికోడ్ దాటి కొరపుజా రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో నిందితుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. రాత్రి 9.45 గంటల సమయంలో డి1 కంపార్ట్మెంటులోకి ప్రవేశించిన సైఫీ.. అక్కడున్న ప్రయాణికులపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa