ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం ఆదేశంతో కేసులో పురోగతి: జే.డీ. లక్ష్మీనారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 16, 2023, 07:24 PM

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడంతో ఏపీలో ప్రస్తుతం చర్చంతా దీని గురించే జరుగుతోంది. పులివెందులలో వైసీపీ శ్రేణులు నిరసనలు చేపడుతుండగా.. సీఎం జగన్ రేపటి తన అనంతపురం పర్యటనను వాయిదా వేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.


ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా డీఐజీ స్థాయి అధికారిని నియమించడం, ఈ నెలాఖరులోగా కేసును పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించడంతో సీబీఐ విచారణ వేగవంతం చేసిందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయ్ కుమార్ రెడ్డి విచారణ సందర్బంగా ఇచ్చిన సమాచారంతో ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగిందని అభిప్రాయపడ్డారు. 120బి చాలా పెద్ద సెక్షన్ అని తెలిపారు.


కొద్దిరోజుల క్రితం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత వెల్లడైన విషయాల ఆధారంగా ఆదివారం వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి ఉంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎంతమంది ఉన్నది..? ఎవరి ప్రోత్సాహం వల్ల జరిగింది? అన్నది త్వరలో విచారణలో తేలుతుందని అన్నారు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి హత్య కేసు విచారణ ఇన్ని సంవత్సరాలు పట్టడం సరికాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 30వ తేదీ నాటికి విచారణ పూర్తి చేసి సీబీఐ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుందని తాను భావిస్తున్నట్లు జేడీ లక్ష్మినారాయణ స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa