ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతిక్ సోదరుల హత్యలపై విచారణకు ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీ

national |  Suryaa Desk  | Published : Sun, Apr 16, 2023, 07:49 PM

అతిక్ సోదరుల  హత్యలపై విచారణకు రాష్ట్రలోని యోగి సర్కార్ ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు  చేసింది. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ శనివారం రాత్రి అనూహ్య రీతిలో హత్యకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తీసుకెళ్తోన్న వీరిపై.. జర్నలిస్ట్ ముసుగులో వచ్చిన దుండగులు దగ్గర నుంచి కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో సోదరులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు షూటర్లు సహా ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కాల్పులకు పాల్పడిన వ్యక్తులను లవ్‌లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్, జర్నలిస్ట్‌కు గాయాలు కాగా.. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పుల అనంతరం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హత్యలపై విచారణకు ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు.


అతీక్ అహ్మద్ సోదరుల హత్యతో యూపీ 144 సెక్షన్ విధించి.. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలను తరలించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని ఏసీఎస్ (హోమ్), డీజీపీలకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించినట్లు ప్రత్యేక డీజీ (లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.


శనివారం రాత్రి 10.35 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని మోతీలాల్ నెహ్రూ ఆస్పత్రికి అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌లను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత సోదరులిద్దరూ వాహనం దిగి పోలీసుల భద్రత నడుమ లోపలికి వెళ్తుండగా.. మీడియా ప్రతినిధులు వారిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులతో సోదరులు మాట్లాడుతుండగా అతీక్ ఎడమ పక్కన ఉన్న ఓ యువకుడు పిస్టల్‌తో ఎడమ కణితి, తలపైకి కాల్పులు జరిపాడు.


అనంతరం అష్రఫ్‌ను కూడా మొదట వెనుక నుంచి కాల్చి ఆపై తలపై కాల్చినట్లు సమాచారం. అతను కూడా నేలపై పడిపోయాడు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 22 సెకెన్లలో 14 రౌండర్లు కాల్పులు జరిపారు. ఇద్దరు షూటర్లు, అతడి సహచరుడ్ని పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన ఇద్దరూ ‘జై శ్రీరామ్’అన్న నినాదాలు చేశారు. ఘటనా స్థలిలో మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతిక్, అష్రఫ్‌లను ఆసుపత్రికి తీసుకురావడానికి కనీసం అరగంట ముందు దుండగులు మీడియా ప్రతినిధులతో ఆసుపత్రి వద్ద వేచి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ముగ్గురు మోటార్‌సైకిళ్లపై ఘటనా స్థలానికి చేరుకుని, ఆ తర్వాత వేచి చూశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa