ఇటీవల యూపీలో కొంగ..మనిషి మధ్య స్నేహం వంటి అంశం ఆసక్తికరంగా మారింది. ఇదిలావుంటే కొంగతో స్నేహం చేస్తూ ఉత్తర్ ప్రదేశ్లోని అమేథికి చెందిన ఆరిఫ్ ఖాన్ గుర్జార్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. గాయాలతో పొలంలో పడి ఉన్న సారస్ కొంగను ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేయగా.. అది కోలుకుంది. అప్పటి నుంచి ఏడాదిపాటు అతడి దగ్గరే అది ఉండిపోయింది. తాజాగా, యూపీలో అచ్చం అటువంటి కథే మరొకటి వెలుగులోకి వచ్చింది. మౌ జిల్లా ఘోసి పోలీస్స్టేషన్ పరిధి బరాయ్పుర్ మాలిక్ గ్రామంలో నివసించే రాజ్సముజ్ యాదవ్ అనే రైతుతో ఓ కొంగ ఏడాది నుంచి స్నేహం చేస్తోంది.
తన పొలంలో ఏడాది కిందట ఆకలితో కనిపించిన కొంగకు రాజ్సముజ్ ఆహారం వేసి, చేరదీశాడు. కొద్ది రోజుల తర్వాత కొంగల గుంపులో దాన్ని వదిలేసేందుకు ప్రయత్నించాడు. దాన్ని దూరం పెట్టేందుకు యాదవ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం వదిలిపెట్టి వెళ్లలేదు. చివరకు కొంగతో రైతుకు అనుబంధం ఏర్పడింది. రాజ్సముజ్ పిలవగానే.. పరుగున వస్తున్న కొంగ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తోంది. ఆరిఫ్ మాదిరిగానే దాంతో ఆడుకోవడం, సమయానికి ఆహారం అందజేస్తుంటాడు.
వన్యప్రాణి సంరక్షణ పేరుతో ఆరిఫ్ నుంచి కొంగను వేరు చేసి, సంరక్షణ కేంద్రానికి తరలించిన అటవీ అధికారుల దృష్టికి మవూ ఉదంతం వెళితే ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సారస్ కొంగ ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనతో ఆడుకుంటుండటం ఏఎన్ఐ షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. కాగా, సారస్ కొంగ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి. కాబట్టి ఈ కొంగలను ఎవరైనా తమ ఇంటి వద్ద అట్టిపెట్టుకోవడం, నిర్బంధించడం చట్టరీత్యా నేరం. ఈ కారణంతోనే గతవారం ఆరిఫ్పై అధికారులు కేసు నమోదు చేశారు. కొంగను స్వాధీనం చేసుకుని.. పక్షి సంరక్షణా కేంద్రానికి తరలించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa