అతిక్ ఆహ్మద్.. గ్యాంగ్స్టర్ కమ్ పొలిటీషియన్. ఉత్తరప్రదేశ్లో ఎంతో ఫేమస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాడు. వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తీసుకురాగా.. ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపి అతిక్ను హతం చేశారు. అంతకు రెండ్రోజుల ముందే అతిక్ కుమారుడు అసద్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతిక్, అతని కుటుంబం గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అతిక్ మూడో కుమారుడు అసద్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల చేతిలో అసద్ హతమయ్యారు. అతీక్ అహ్మద్ మూడో కుమారుడు అసద్ అహ్మద్. అసద్పై ఇప్పటివరకు ఒకే కేసు నమోదైంది. ఉమేష్ పాల్, అతని ఇద్దరు గన్మెన్ల హత్యకు సంబంధించి అసద్పై కేసు ఉంది. ఉమేష్ పాల్ హత్య తర్వాత అసద్ పరారీలో ఉన్నారు. ఉమేష్ పాల్ హత్యకు ఘటనలో సీసీటీవీ ఫుటేజీలో అసద్ కాల్పులు జరుపుతూ.. కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
2003 సెప్టెంబర్లో అసద్ జన్మించారు. అతని వయస్సు 19 ఏళ్లు. అసద్ ప్రయాగ్రాజ్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత లక్నోలోని ఒక ప్రైవేటు పాఠశాలలో మిగతా చదువును పూర్తి చేశారు. అసద్.. విదేశాలకు వెళ్లి 'లా' చదవాలనుకున్నాడు. పాస్పోర్ట్ కోసం కూడా అప్లై చేసుకున్నాడు. కానీ పోలీసుల వెరిఫికేషన్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అతనికి పాస్పోర్ట్ రిజెక్ట్ అయింది. ఫలితంగా అతను విదేశాలకు వెళ్లి చదువుకోలేకపోయారు. ఒకవేళ పాస్పోర్ట్ వచ్చి ఉంటే.. ఈరోజు వేరేలా ఉండేదని అతిక్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు చెబుతున్నారు.
అతీక్ అహ్మద్ పెద్ద కొడుకు పేరు ఉమర్ అహ్మద్. లక్నోలో వ్యాపారవేత్త మోహిత్ జైస్వాల్ కిడ్నాప్ కేసులో ఉమర్ అహ్మద్ ప్రధాన నిందితుల్లో ఒకరు. 2022 ఆగస్టులో ఉమ్మర్ అహ్మద్ లక్నోలో లొంగిపోయాడు. మోహిత్ జైస్వాల్ను కిడ్నాప్ చేసి.. తీవ్రంగా కొట్టి.. కంపెనీలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ఉమర్ అహ్మద్ కూడా 'లా' చదివారు. అతను ప్రస్తుతం లక్నో జైలులో ఉన్నారు. తమ్ముడు, తండ్రి, చిన్నాన్న మరణ వార్త తెలిసి.. అహ్మద్ జైలులో కుప్పకూలాడు.
అతీక్ అహ్మద్, అతని కుమారులే కాదు.. భార్య షాయిస్తా పర్వీన్పై కేసులు ఉన్నాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో పర్వీన్ కూడా నిందితురాలే. పర్వీన్పై 2009లో ప్రయాగ్రాజ్లోని కల్నల్గంజ్లో మూడు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. అవి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. పర్వీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కోర్టు మంజూరు చేయలేదు. ఇంకా ఇద్దరు మైనర్లు ఉన్నారు. అయితే.. వారిని పోలీసులు అక్రమంగా ఎక్కడికో తీసుకెళ్లారని.. అతిక్ భార్య ఆరోపిస్తోంది. హెబియస్ కార్పస్ పిటిషనే వేసే ప్రయత్నాల్లో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa