ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదాం: మంత్రి ఆర్.కె.రోజా సవాల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 16, 2023, 07:56 PM

మీ మేనిఫెస్టో తెచ్చుకో, మా మేనిఫెస్టో తెస్తాం.. ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సవాల్ విసిరారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టిడ్కో ఇళ్ల ముందు తీసుకుంటోంది సెల్ఫీ కాదు.. ‘సెల్ఫ్ గోల్’ అని ఆమె అన్నారు. ఈ మేరకు శనివారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మంత్రి రోజా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీ మేనిఫెస్టో తెచ్చుకో, మా మేనిఫెస్టో తెస్తాం.. ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరితో సెల్ఫీ తీసుకుంటారో చూద్దామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ఛాలెంజ్ విసిరారు.


ప్రజలతో నేరుగా ‘మెగా సర్వే’ చేయటానికి దమ్ము ఉండాలని.. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉందని మంత్రి రోజా చెప్పారు. తన పాలనపై సీఎం జగన్‌కు నమ్మకం ఉందని.. అందుకే 7 లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సర్వేలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. గ్రామ, వార్డు వాలంటీర్లంతా జగన్మోహన్ రెడ్డికి సైనికుల్లాగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌పై నమ్మకంతోనే అన్ని వర్గాల వారు ఉన్నారని తెలిపారు.


గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగేది కాదని జనం చెప్తున్నారని.. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు పనులు చేసి పెడుతున్నారని చెప్తున్నారని పేర్కొన్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ అని అన్నారు. ఇక, సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ల మీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన వాళ్లు దొంగతనంగా వెళ్లి పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారని మంత్రి రోజా ఆక్షేపించారు. అయితే, రాష్ట్రంలో ఓ పది ఇళ్లకు ఇలా చేసి చంద్రబాబు అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇక, టిట్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారని.. అది సెల్ఫీ కాదు, సెల్ఫ్ గోల్ అని ఎద్దేవా చేశారు.


తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో లేదా చంద్రబాబు ఎమ్మెల్యేగా చేస్తున్న కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో బహిరంగంగా సర్వే చేద్దామా అని మంత్రి రోజా సవాల్ విసిరారు. తన సవాల్‌ను తీసుకుంటావా చంద్రబాబూ అని అన్నారు. రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేదని.. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాలనలో చేసి చూపించారని చెప్పారు.


ఈ రాష్ట్రాని పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు అని మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలని తీసుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. అలాగే, యువతకు నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారని.. రైతులకు రుణమాఫీ పేరుతో దగా చేశారని మండిపడ్డారు. ఇలా ప్రతి వర్గాన్నీ మోసం చేశారని ఫైరయ్యారు. సీఎం జగన్ పాలనలో అందరికీ న్యాయం చేశారు కాబట్టే ధైర్యంగా తాము జనంలోకి వెళ్తున్నామని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa