పంజాబ్లోని లూథియానా షేర్పూర్ చౌక్ సమీపంలోని సువా రోడ్లోని ఓ ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం విషవాయువు లీకైంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ఉదయం 7.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. అంబులెన్స్ల్లో బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల ఉత్పత్తులను సంబంధించిన ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయినట్లు తెలిసింది. గోయల్ మిల్క్ ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ నుంచి విషవాయువు వెలువడినట్లు సమాచారం. ఆ విషవాయువు కారణంగా ఫ్యాక్టరీ సమీపంలో నివసిస్తున్న పలువురు స్పృహతప్పి పడిపోయారు. పలువురు శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న లూథియానా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ స్వాతి.. పరిస్థితిని సమీక్షించారు. ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుందని వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతుందని ఆమె వెల్లడించారు. గ్యాస్ లీకేజీ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమని అన్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయని..అన్ని విధాల ప్రజలకు సహాయక సహకారాలు అందిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa