సుడాన్ దేశంలో సైన్యం, ఆర్పీఎఫ్ మధ్య ఆధిపత్య పోరాటం ఇంకా కొనసాగుతోంది. దీంతో అంతర్యుద్ధంతో అట్టుడుకుతోన్న సూడాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరీని చేపట్టింది. ఇదిలావుంటే అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం పెను సాహసమే చేసింది. సూడాన్లోని సయ్యిద్నా వద్ద 121 మంది భారతీయులు చిక్కుకుపోగా.. వారి కోసం ఒక చిన్న రన్వేపైనే విమానాన్ని వాయుసేన పైలట్ చాకచక్యంగా కిందకు దింపాడు. పూర్తిగా సిద్ధం కానీ రన్వేపై ప్రమాదకరరీతిలో నైట్ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. ల్యాండింగ్కు మార్గదర్శనం చేసే నావిగేషనల్ వ్యవస్థ, ఫ్యూయల్, ల్యాండింగ్ లైట్లు లేకుండానే భారత వైమానిక దళానికి చెందిన C-130J హెర్క్యులస్ విమానాన్ని పైలట్ ల్యాండ్ చేశారు.
సూడాన్లో హింసాకాండకు కేంద్రమైన ఖార్టూమ్కు ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సయ్యిద్నాలో భారత వైమానిక దళం పైలట్లు నైట్ విజన్ గాగుల్స్ ని ఉపయోగించి రాత్రి పూట ల్యాండింగ్ చేశారు. విమానం రన్వేను సమీపిస్తున్నప్పుడు దాని ఎలక్ట్రో-ఆప్టికల్ / ఇన్ఫ్రా-రెడ్ సెన్సార్లను ఉపయోగించి చిన్న రన్వేపై ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకున్నారు. రన్వే స్పష్టంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత పైలట్లు వ్యూహాత్మక విధానాన్ని చేపట్టారు. ల్యాండింగ్ తర్వాత విమానం ఇంజన్లు రన్ అవుతూనే ఉన్నాయి.
ఎయిర్ఫోర్స్ ప్రత్యేక దళాల విభాగానికి చెందిన ఎనిమిది మంది గరుడ కమాండోలు ప్రయాణీకులను సురక్షితంగా ఎక్కించారు. ల్యాండింగ్ మాదిరిగానే టేకాఫ్కు సైతం నైట్ విజన్ గాగుల్స్ (ఎన్వీజీ)ను ఉపయోగించారు. వాడి సయ్యద్నా, జెడ్డా మధ్య రెండున్నర గంటల ఆపరేషన్.. గతంలో అఫ్గన్లోని కాబూల్లో నిర్వహించిన ఆపరేషన్కు సమానంగా ఉంటుంది. మానవతా సంక్షోభ సమయంలో సాహసోపేతమైన ఆపరేషన్లు నిర్వహించే భారత వైమానిక దళం సాహసానికి ఇది మరొక నిదర్శనం.
ఇదిలావుంటే ఆపరేషన్ కావేరీలో భాగంగా శుక్రవారం మరో 754 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 392 మంది భారత వాయుసేనకు చెందిన సీ-17 విమానంలో ఢిల్లీకి, మిగతవారు వేరే విమానంలో బెంగళూరుకు వచ్చారు. తొలుత వీరందరిని సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి చేర్చి.. అక్కడ నుంచి భారత్కు తరలిస్తున్నారు. తొలివిడతగా బుధవారం 360 మందిని, రెండో విడతగా గురువారం 246 మందిని సీ-17 గ్లోబ్ మాస్టర్లో ముంబయికి చేర్చారు. దీంతో ‘ఆపరేషన్ కావేరి’ కింద స్వదేశానికి చేరుకున్న భారతీయుల సంఖ్య 1360కి చేరినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa