ఓ వ్యక్తికి వివాహమై, పిల్లలున్న విషయం భాగస్వామికి స్పష్టంగా తెలిసిన తర్వాత సహజీవనంలోకి ప్రవేశించడాన్ని మోసంగా పరిగణించలేమని కలకత్తా హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి.. ఏడాది పాటు సహజీనం చేసిన తర్వాత మాటమార్చి మోసానికి పాల్పడ్డారని పేర్కొంటూ హోటల్ ఎగ్జిక్యూటివ్కి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ మేరకు న్యాయస్థానం రద్దు చేసింది. ఐపీసీ సెక్షన్ 415లో నిర్వంచించిన ‘మోసం’అనేది ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ప్రేరేపణలను సూచిస్తుందని జస్టిస్ సిద్ధార్థ రాయ్ చౌదురి తన తీర్పులో పేర్కొన్నారు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రేరేపించినట్టు ఆధారాలతో నిరూపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఒక వ్యక్తి తనకు వివాహం జరిగి, పిల్లలు ఉన్న విషయం దాచిపెట్టకుండా.. సహజీవనానికి బాధితురాలు స్పృహతో అంగీకరించినట్లయితే అది మోసం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 415లో నిర్వచించిన విధంగా వాస్తవాన్ని దాచిపెట్టి మోసానికి దారితీసినట్టు రుజువుకాలేదని హైకోర్టు పేర్కొంది. పెళ్లి చేసుకుంటాననే వాగ్దానంతో 11 నెలల పాటు సహజీవనం సాగించి మోసం చేశారని బెంగాల్కు చెందిన వ్యక్తికి అలీపూర్ ట్రయల్ కోర్టు రూ. 10 లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
2015 నాటి కేసు వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ ఫిబ్రవరి 2014లో హోటల్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన సమయంలో అక్కడ ఫ్రంట్ డెస్క్ మేనేజర్ను కలిసినట్టు కలకత్తా ప్రగతి మైదాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ మేనేజర్ తనను ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడని, తాము మొదటిసారి కలిసినప్పుడు నిందితుడు తన భార్యతో విడిగా ఉన్నట్టు చెప్పాడని ఆ మహిళ పేర్కొంది. త్వరలోనే విడాకులు తీసుకుని, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సహజీవనం కోసం అతడు చేసిన ప్రతిపాదనకు ఆమె సరేనంది.
సదరు మహిళ తల్లిదండ్రులకు ఈ సంబంధం గురించి తెలిసినా తమ కుమార్తెకు త్వరగా పెళ్లి చేయాలని కోరుకున్నారు. కానీ విడాకుల తీసుకోవడంలో అతడు జాప్యం చేశాడు. ఏడాది తర్వాత విడిపోయిన తన భార్యను ముంబైకి వెళ్లొచ్చిన తర్వాత.. విడాకులపై తన మనసు మార్చుకున్నట్లు ఆమెకు తెలియజేశాడు. దీంతో మోసపోయానని భావించిన ఆ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విడాకులు తీసుకుని తనను వివాహం చేసుకుంటానని చెప్పిన తర్వాత మాత్రమే సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నట్లు కోర్టు తెలిపింది. ‘వాగ్దాన ఉల్లంఘన’ జరిగిందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం వివాహం రద్దుతో ముడిపడి ఉంది.. అంతేకాదు, ఒక వ్యక్తి తన స్వంతంగా విడాకులపై నిర్ణయం తీసుకోలేడు.. దానికి వారి విడిపోయిన జీవిత భాగస్వాములు అంగీకరించాలి లేదా కోర్టు ద్వారా పొందాలి.. కాబట్టి, అటువంటి సహజీవనం ప్రారంభమైనప్పటి నుంచి అనిశ్చితి ఉంది’ అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa