ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదాల్లో చిక్కుకున్న ది కేరళ స్టోరీ ట్రైలర్

national |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 10:00 PM

ఇటీవల మనదేశంలో వివాదాస్పద చిత్రాలు విడుదల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మరో చిత్రం రాబోతోంది. 'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌లో.. బ్రెయిన్ వాష్, లవ్ జిహాద్, హిజాబ్, ఐసిస్ వంటి పదాలను వాడారు. కేరళ నుంచి తప్పిపోయిన 32 వేల మంది అమ్మాయిలను ముందుగా బ్రెయిన్‌వాష్ చేసి.. బలవంతంగా ఇస్లాంలోకి మార్చేసి.. ఆ తర్వాత ఐసిస్ ఉగ్రవాదులుగా మార్చినట్టు చెబుతున్న కథ ఇది. ఏప్రిల్ 26న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పటివరకు 1.4 కోట్లకు పైగా చూశారు. కొందరు ఈ సినిమా కథను ప్రచారంగా చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఎప్పుడూ మాట్లాడని కేరళ వాస్తవికత అని అంటున్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో ఈ ట్రైలర్ చూసిన వారి మనసులో సినిమా కథకు సంబంధించి కొన్ని ప్రశ్నలు తలెత్తక తప్పదు. నిజంగా కేరళలో హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు, మహిళలు బానిసలుగా తయారయ్యారా? 32 వేల మంది హిందూ, క్రిస్టియన్ యువతులను ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లోకి చేర్చుకున్నారని సినిమాలో చేసిన వాదనలు నిజమా? అనే చర్చలు జరుగుతున్నాయి.


మహారాష్ట్రలో కొడవలి గ్యాంగ్ హల్‌చల్


'ది కేరళ స్టోరీ' ట్రైలర్‌లో అదా శర్మ ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఆదా పాత్ర.. షాలినీ ఉన్నికృష్ణన్ అనే హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయి. కొంతమంది షాలినిని ఎలా మారుస్తారనేది ట్రైలర్‌లో చూపించారు. సినిమాలో ఆమె పేరు ఫాతిమా. బురఖా ధరించి, ఫాతిమా టీజర్‌లో తన కథను వివరిస్తూ.. 'ఆమె హిందువు, ఆమె పేరు షాలిని ఉన్నికృష్ణన్. ఇప్పుడు ఆమెను ఫాతిమా అని పిలుస్తున్నారు. ఆమె నర్సు కావాలనుకుంది. కానీ.. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లోని జైల్లో ఐసిస్ ఉగ్రవాదిగా ఉంది' అని చెబుతుంది.


అంతేకాదు.. 'ఆమెలాంటి మరో 32 వేల మంది అమ్మాయిలు మతం మార్చబడి.. సిరియా, యెమెన్‌లకు పంపబడ్డారు. సాధారణ అమ్మాయిలను ఉగ్రవాదులుగా మార్చే ప్రమాదకరమైన గేమ్ కేరళలో బహిరంగంగా సాగుతోంది' అని ఫాతిమా క్యారెక్టర్ చెబుతుంది. ఈ సినిమాపై నిర్మాత విపుల్ అమృతలాల్ షా కీలక విషయాలు వెల్లడించారు. '2010లో కేరళ సీఎంగా ఉన్న ఊమెన్ చాందీ అసెంబ్లీలో ఒక నివేదిక వెల్లడించారు. తన హయాంలో ప్రతి సంవత్సరం 2,800 నుంచి 3,200 మంది బాలికలు ఇస్లాంను స్వీకరించారు' అని చెప్పారు. అంటే ఐదేళ్లలో 7800కు పైగా మత మార్పిడులు జరిగాయి. దీని నుంచి వచ్చే 10 సంవత్సరాలను లెక్కించండి.. ఈ సంఖ్య 30 నుంచి 32 వేలు అని నిర్మాత వ్యాఖ్యానించారు.


చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ కూడా 32 వేల మంది అమ్మాయిల మత మార్పిడికి సంబంధించి అదే వాదనను వినిపించారు. తాను చెబుతున్న ఫిగర్ తనది కాదని.. ఊమెన్ చాందీదేనని సుదీప్తో స్పష్టం చేశారు. ఈ ఇష్యూపై మీడియా కథనాలను పరిశీలిస్తే.. అప్పటి కేరళ సీఎం ఊమెన్ చాందీ.. 2010లో కాకుండా జూన్ 2012లో కోర్టుకు ఈ అంశంపై వివరణ ఇచ్చారు. 'జూన్ 25న అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. 2006 నుంచి రాష్ట్రంలో 2,667 మంది బాలికలు ఇస్లాం మతంలోకి మారారు' అని అసెంబ్లీలో కూడా చెప్పారు.


అయితే.. ప్రతి సంవత్సరం 2,667 మంది బాలికల మత మార్పిడికి గురవుతున్నారని మాత్రం ఊమెన్ చాందీ చెప్పలేదు. 2006 నుంచి 2012 వరకు ఆరున్నరేళ్ల కాలంలో కేరళలో 2,667 మంది బాలికలు ఇస్లాంలోకి మారారని మాత్రమే చెప్పారు. అయితే.. మతం మారిన వీరు సిరియాకు వెళ్లడం లేదా ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరడంపై ఏమీ మాట్లాడలేదు. అంటే.. సినిమా ప్రకారం.. కేరళలో మొత్తం 32 వేల మంది అమ్మాయిలు ఇస్లాం మతంలోకి మారినట్లు, ISISలో చేరినట్లు స్పష్టమైన ఆధారాలు లేవనే వాదన వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి 'ది కేరళ స్టోరీ' ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో!







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa