ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్కు పరిశ్రమ నష్టాల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 06:21 PM

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ నష్టాల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐ ఎన్‌ఎల్‌) దశల వారీగా నష్టాల్లోకి వెళ్లడం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందన్నారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై త్వరలో ఎంపీలందరినీ కలిసి వాస్తవాలు వివరిస్తారని, ప్రైవేటీకరణను ఆపాల్సిందిగా కోరతామని వెల్లడించారు. ఈ మేరకు కె.రామకృష్ణ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.


మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అడుగడుగునా ద్రోహం చేస్తూనే ఉందని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని.. విభజన హామీలను పట్టించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్‌లో కనీసం నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. అన్నింటినీ విస్మరించి.. పదేపదే మోసం చేస్తోందని తెలిపారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్మేందుకు మోదీ సర్కార్‌ పావులు కదిపిందని దుయ్యబట్టారు.


విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించకుండా దశల వారీగా నష్టాల్లోకి నెట్టేసిందని రామకృష్ణ తెలిపారు. గత ఏడాది రూ. 913 కోట్ల లాభాలు వచ్చిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు.. 2022- 23 లో రూ. 3,049 కోట్లు నష్టం రావడం వెనక కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. దాదాపు రూ. 3 లక్షల కోట్ల విలువ చేసే రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విశాఖ స్టీల్‌ ప్లాంట్‌)ను పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి కారు చౌకగా కట్టబెట్టేందుకు చూస్తోందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 810 రోజులకు పైగా ఉద్యమం నిర్విరామంగా జరుగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.


విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కుట్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నోరువిప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. తన వైఖరి స్పష్టం చేయాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సమిష్టిగా గళం విప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం ఉక్కు అమ్మకాన్ని విరమించుకుంటున్నట్లు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేటట్లు చూడాలని ఎంపీలను రామకృష్ణ కోరారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa