ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురానాఖిల్లాలో జరుగుతోన్న పురావస్తు శాఖ తవ్వకాలు

national |  Suryaa Desk  | Published : Wed, May 31, 2023, 09:47 PM

దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో 2,500 ఏళ్ల కిందటి ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో మౌర్యుల కాలానికి ముందు, తర్వాత 9 సాంస్కృతిక తరాలకు (కల్చరల్‌ లెవల్స్‌కు) సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైనట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ తవ్వకాలను కేంద్ర మంత్రి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పురానా ఖిల్లా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న చోటును ‘ఇంద్రప్రస్థ స్థలం’ గా గుర్తించినట్లు తెలిపారు.


మౌర్యులకు ముందు, మౌర్యుల కాలం, శుంగులు, కుషాణులు, గుప్తులు, గుప్తుల తర్వాత, రాజ్‌పూత్‌లు, సుల్తానులు, మొగలుల కాలం వరకు మొత్తం 9 తరాల ఆనవాళ్లు లభించాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో మౌర్యులకు ముందు కాలం నుంచి మొగలుల వరకు చారిత్రక ఆనవాళ్లు బహిర్గతమైన ఏకైక ప్రాంతం ఇదేనని కేంద్ర మంత్రి వివరించారు. 2,500 ఏళ్ల కిందటి మానవ నివాస ప్రాంతాలు, జీవన అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. మ్యూజియం సమీపంలో 5.5 మీటర్ల లోతు తవ్వకాలు జరిపిన ప్రాంతం నుంచి 136 నాణేలు, 35 ముద్రలు, పరికరాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఒకప్పటి వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా భావిస్తున్నామని తెలిపారు.


ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, ప్రాజెక్ట్ ఇంఛార్జ్ వసంత్ స్వర్న్‌కర్ మాట్లాడుతూ.. ‘ఈ తవ్వకాల లక్ష్యం కాలక్రమాన్ని బహిర్గతం చేసి తద్వారా నిరంతర నివాస నిక్షేపాలను వెలికితీయడం.. ఢిల్లీ ప్రాచీన సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకునే ప్రదేశంలో మునుపటి త్రవ్వకాలు, అనేక కందకాలలో విభిన్న సంస్కృతులు బహిర్గతమయ్యాయి.. కుషాన్, శుంగ, మౌర్యుల కాలం నాటి దిగువ స్థాయిల ఆవాసాల విస్తరణను గుర్తించడానికి ఈ తవ్వకాలు చేపట్టాం’ అని వివరించారు. రాజ్‌పుత్, గుప్త, కుషాన్ కాలం నుంచి గోధుమలు, కాయధాన్యాలుగా గుర్తించిన కొన్ని కాల్చిన ధాన్యాల నమూనాలను వెలికితీశాం అని ఆయన చెప్పారు.


ఈ తవ్వకాలలో వైకుంఠ విష్ణు రాతి విగ్రహం, గజలక్ష్మి టెర్రాకోట విగ్రహం, వినాయకుడి రాతి విగ్రహం, సీల్స్‌ (ముద్రలు), నాణేలు, మనుషులు, జంతువుల టెర్రాకోట బొమ్మలు, రాతితో రూపొందించిన మంచాలు, ఎముకలతో చేసిన సూదులు మొదలైనవి లభించాయని పేర్కొన్నారు. 1955 నుంచే ఈ ప్రాంతంలో ఏఎస్ఐ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa