ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ముందు ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు సిద్ధరామయ్య సర్కార్ పచ్చజెండా

national |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 09:03 PM

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమైన ఐదు పథకాలను కన్నడ ప్రజలకు ఉచితంగా అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. జూన్ 2న ( శుక్రవారం ) నిర్వహించిన కేబినెట్ భేటీ తర్వాత ఈ విషయాన్ని సిద్ధరామయ్య వెల్లడించారు. పథకాల అమలులో కుల, మత బేధాలు చూడకుండా అర్హులైన అందరు లబ్ధిదారులకు ఉచిత హామీలను అమలు చేస్తామని ప్రకటించారు.


ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే.. గృహ జ్యోతి పథకాన్ని జులై 1 నుంచి మలు చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. జులై వరకు ఉన్న విద్యుత్ బిల్లులను ప్రజలే చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అన్న భాగ్య పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం అందిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 'శక్తి' పథకం కింద కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. అదే సమయంలో 'యువ నిధి' పథకం కింద డిగ్రీ పూర్తిచేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి భృతి చెల్లిస్తామని తెలిపారు. 2022-23లో పాసై.. నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులకు రూ.3 వేలు.. డిప్లొమా విద్యార్థులకు రూ.1,500.. 24 నెలల పాటు అందజేస్తామని సిద్ధరామయ్య ప్రకటించారు.


కర్ణాటక కేబినెట్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఐదు హామీలపై పూర్తిగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఐదు హామీలను అమలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. హామీల అమలుపై తనతోపాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంతకం చేసినట్లు వెల్లడించారు. ఉచిత హామీలు కన్నడ ప్రజలకు చేరేలా చూస్తామని ఈ సందర్భంగా సిద్ధరామయ్య చెప్పారు. ఇదే సమయంలో గృహలక్ష్మి పథకం కింద కుటుంబంలోని మహిళ యజమానికి నెలకు రూ. 2వేల ఆర్థిక సాయం పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభించనున్నట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు.  ఈ ఐదు ఉచిత హామీలు అమలు చేస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర భారం పడనుంది. గృహ జ్యోతి, అన్న భాగ్య, శక్తి, యువనిధి, గృహలక్ష్మి పథకాల అమలుకు.. కర్ణాటక రాష్ట్ర సర్కారుపై ఏటా రూ.50వేల కోట్లకుపైగా భారం పడనుందని అంచనా వేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa