ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెజ్లర్లకు మద్దతుగా స్పందించిన బీజేపీ మహిళ ఎంపీ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 09:04 PM

రెజ్లింగ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ వ్యవహారం పై తాజాగా బీజేపీ మహిళా ఎంపీ స్పందించడం గమనార్హం. రెజ్లర్లు చేసిన ఫిర్యాదులను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం ఎంపీ ప్రీతమ్ ముండే పేర్కొన్నారు. ఒక భాజపా ఎంపీగా ఈ మాట చెప్పడం లేదన్న ప్రీతమ్ ముండే.. సాటి మహిళగా చెబుతున్నానని తెలిపారు. కేవలం రెజ్లర్లు మాత్రమే కాదు.. దేశంలోని ఏ మహిళ ఫిర్యాదు చేసినా.. ముందు దాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణ చేపట్టాలని అన్నారు. బాధితులు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఫిర్యాదు స్వీకరించకపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రెజ్లర్ల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రీతమ్‌ ముండే తెలిపారు.


ఈ సందర్భంగా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణల కేసు దర్యాప్తు విషయంలో యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు ప్రీతమ్ ముండే గుర్తు చేశారు. 45 రోజుల్లోగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించకపోతే భారత రెజ్లింగ్‌ సమాఖ్య గుర్తింపును రద్దు చేస్తామని ఇటీవల యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చరించిందని తెలిపారు. దీంతో రెజ్లర్ల నిరసనలు అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయిందని అన్నారు. ఇలాంటి సమయంలో విచారణ కమిటీ వేస్తే అది కేవలం ప్రచారం కోసమే చేసినట్లవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. రెజ్లర్లతో సరైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదని ప్రీతమ్ ముండే తెలిపారు. తాను కూడా ప్రభుత్వంలో భాగమైనప్పటికీ నిజాలను అంగీకరించాల్సిందేనని అన్నారు. బీజేపీకి దేశమే మొట్టమొదటి ప్రాధాన్యత అని.. ఆ తర్వాత పార్టీ.. వ్యక్తిగతానికి చివరి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. రెజ్లర్ల ఆందోళనలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నా గుర్తించకపోవడం సరికాదని తాను భావిస్తున్నానని ప్రీతమ్‌ ముండే వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa