ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోపాల్ సాత్పురా భవన్‌లో చెలరేగిన మంటలు,,,ప్రమాద స్థలికి సమీపంలోనే అత్యాధునిక ఫైర్ ఇంజిన్

national |  Suryaa Desk  | Published : Wed, Jun 14, 2023, 09:54 PM

మధ్యప్రదేశ్ భోపాల్‌ లోని ప్రభుత్వ కార్యాలయాలున్న సాత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలున్న ఈ భవనంలో చెలరేగిన మంటలను అదుపుచేయడానికి స్థానిక అగ్నిమాపక సిబ్బంది, వాయుసేన, సైన్యం 14 గంటలకు పైగా శ్రమించారు. భవనంలో మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో అక్కడికి కొద్ది దూరంలో ఓ ఆధునిక ఫైర్‌ ఇంజిన్‌ నిలిపి ఉంచడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆ ఫైర్‌ ఇంజిన్‌ను సకాలంలో ఉపయోగించి ఉంటే మంటలు మరింత త్వరగా అదుపులోకి వచ్చేవని అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఆరోపిస్తున్నారు.


మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 9 నెల కిందట రూ. 5.5 కోట్లతో అత్యాధునిక హైడ్రాలిక్‌ ఫైర్‌ ఇంజిన్‌ను కొనుగోలు చేసింది. దీని సాయంతో అగ్నిమాపక సిబ్బంది 18 అంతస్తుల ఎత్తైన భవనంపైకి సునాయాసంగా చేరుకోవచ్చు. కానీ, ఆర్టీఏ అధికారుల నుంచి ఈ ఫైర్‌ ఇంజిన్‌కు అనుమతులు రాకపోవడంతో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు దీన్ని వినియోగించుకోలేపోతున్నట్టు ఫైర్‌ సిబ్బంది వెల్లడించారు. అంతేకాదు, ఈ హైడ్రాలిక్‌ ఫైర్‌ ఇంజిన్‌ను వినియోగంపై సిబ్బందికి పూర్తి అవగాహన లేకపోవడమే దీన్ని పక్కన పెట్టడానికి మరో కారణంగా చెబుతున్నారు.


ఇదే అంశంపై మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా వివరణ ఇచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో హైడ్రాలిక్‌ ఫైర్‌ ఇంజిన్‌ వెళ్లేందుకు స్థలం లేకపోవడంతో దాన్ని ఉపయోగించలేదని తెలిపారు. పార్కింగ్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతుండటమే ఇందుకు కారణమని చెప్పారు. ఇకపై పెద్ద భవనాలు ఉన్న ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు వెళ్లేందుకు సరిపడా దారి ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ఆదేశించినట్లు తెలిపారు. హైడ్రాలిక్ నిచ్చెన కొనుగోలు చేయడానికి ముందు మెట్ల నిచ్చెనలను ఉపయోగించేవారు. దీని సాయంతో కేవలం మూడు నాలుగు అంతస్తులు మాత్రమే ఎక్కే అవకాశం ఉంది.


సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో సాత్పురా భవనంలోని మూడో అంతస్తులో ఆదివాసీ సంక్షేమశాఖ ప్రాంతీయ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అందులోని ఎయిర్‌ కండిషనర్లు, గ్యాస్‌ సిలిండర్లకు మంటలంటకుని పేలుళ్లు సంభవించాయి. అక్కడ నుంచి మరో మూడు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో ఆరోగ్యశాఖకు చెందిన అత్యంత కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై భోపాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హరినారాయణ చారి మిశ్రా స్పందిస్తూ.. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చినట్లు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa