ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ పేమెంట్స్ రంగంలో భారత్ పురోగతి,,,అమెరికా దౌత్యవేత్త ఎరిక్

international |  Suryaa Desk  | Published : Wed, Jun 14, 2023, 09:55 PM

భారత్ పై అమెరికా పొగడ్తలు  కురిపంచింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ పై భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ అంతర్జాతీయ నిధి అంటూ ఆకాశానికెత్తేశారు. ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామానికి చెందిన భారత జాతీయ సలహాదారు అజిత్ దోవల్.. కేవలం జాతీయ నిధి మాత్రమే కాదు అంతర్జాతీయ సంపద అని గార్సెట్టి ప్రశంసించారు. ‘ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామం నుంచి వచ్చిన అజిత్ దోవల్ భారత్‌కు ఒక నిధిలా ఎదిగారు. అంతేగాకుండా అంతర్జాతీయ సంపదగానూ మారారు’ అని ఎరిక్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా, భారత్ మధ్య ఉన్న బంధాన్ని చూసి సంతోషించారు.


క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై అమెరికా- భారత్ చొరవ అనే అంశంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎరిక్ గార్సెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇరు దేశాల మధ్య దృఢమైన బంధం ఉంది. భారతీయులు అమెరికన్లను, అమెరికన్లు భారతీయులను ప్రేమిస్తారని స్పష్టంగా తెలుస్తోంది’ అని చెప్పారు. అలాగే డిజిటల్ పేమెంట్స్‌, ఫైనాన్సియల్‌ టెక్నాలజీ రంగాల్లో భారత్‌ అద్భుతమైన పురోగతి సాధిస్తోందని కొనియాడారు. ఒక గ్రామంలోని టీ దుకాణం నడిపే వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి పొందుతున్న లబ్ధిని నేరుగా తన ఫోన్‌లోనే చూసుకుంటున్నారని వివరించారు.


ఇది డిజిటల్ ఇండియా వల్లే సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ‘ఇటీవల భారత్‌లోని బహుళ విశ్వాస నాయకుల బృందంతో విందులో పాల్గొన్నాను.. వారిలో ఒకరు ఇలా అన్నారు.. ‘మేము 4G, 5G, 6G గురించి ఈ చర్చలన్నీ వింటున్నాం.. కానీ ఇక్కడ భారతదేశంలో మనకు దాని కంటే శక్తివంతమైనది ఉంది.. అది 'గురూజీ’ అని చెప్పినట్టు ఎరిక్ తెలిపారు.


అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోదీ పాలనపై అమెరికా యంత్రాంగం ప్రశంసలు కురిపిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లీవాన్‌.. ప్రధాని నరేంద్ర మోదీతో మంగళవారం సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని ఈ సందర్భంగా మోదీకి ఆయన వివరించారు.‘మీ పర్యటన కోసం బైడెన్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఘనంగా స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో ఉన్నారు’ అని సుల్లీవాన్‌ వివరించారు. ఆయన మంగళవారం అజిత్ దోవల్‌తో కూడా సమావేశమయ్యారు. హై టెక్నాలజీ రంగాలకు సంబంధించిన ఏడు రంగాల్లో భారత్‌, అమెరికా మధ్య భాగస్వామ్యం కోసం వీరు మంగళవారం ఒక మార్గసూచీని ఆవిష్కరించారు. తొలి విడతగా జనవరి 30న వాషింగ్టన్‌ డీసీలోని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఇందులో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa