ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జులై 1 నుంచి స్పెషల్ క్యాంపులు నిర్వహణ,,,నాలుగు వారాల పాటూ సచివాయాల్లో సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 05:23 PM

జులై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర ప్రత్యేక క్యాంపులు నాలుగు వారాల పాటు నిర్వహించాలని ఏపీ  సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ స్పెషల్ క్యాంపుల్లో 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్వీస్ చార్జీలు వసూలు చేయరు. ఈ నెల 24 నుంచే వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను కూడా స్వీకరించనున్నారు.


ఈ ప్రత్యేక క్యాంపుల నిర్వహణ కోసం మండలాల వారీగా ఎంపీడీవో, తహసీల్దార్‌ల ఆధ్వర్యంలో రెండు వేర్వేరు టీమ్‌లను ఏర్పాట చేయనున్నారు. ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులు ఉంటారు. అవసరమైతే మూడో బృందాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు ఈ క్యాంపుల పర్యవేక్షణకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందుగా అందరికీ తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఈ కార్యక్రమంలో పాల్గొనే సిబ్బంది, వలంటీర్లకు ముందస్తుగా శిక్షణ ఇవ్వనున్నారు. సచివాలయాల దగ్గర నిర్వహించే క్యాంపుల్లో ఈ 11 సర్వీసులకు ఎలాంటి సర్విసు చార్జీలు ఉండవు.. మ్యుటేషన్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీకి దరఖాస్తుదారులు చెల్లించాల్సిన స్టాట్యుటరీ చార్జీలను మాత్రం వసూలు చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్వీసు చార్జీలు లేకుండా అందజేసే సేవల వివరాలు కింది విధంగా ఉన్నాయి.


1) ఆదాయ ధ్రువీకరణ పత్రం


2) డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌


3) ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)


4) మరణ ధ్రువీకరణ పత్రం


5) మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌


6) కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన


7) ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు


8) ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌


9) కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)


10) వివాహ ధ్రువీకరణ పత్రం (పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లోపు)


11) ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు.


దండాలయ్యా సీఎం సార్.. జగన్‌కు ఉద్యోగుల కృతజ్ఞతలు


మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌ విషయానికి వస్తే.. భూకొనుగోలు అనంతరం ఆన్‌లైన్‌లో నమోదు.. అదే మ్యుటేషన్‌ ఫర్‌ కరక్షన్స్ ఆన్‌లైన్‌లో భూవివరాల నమోదులో మార్పులు చేర్పులు ఉంటాయి. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ వినతుల్ని సంతృప్త స్థాయిలో పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa