ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదు,,,చంద్రబాబుపై సోము వీర్రాజు సెటైర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 05:52 PM

చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు. నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ అన్నారుగా.. ఇప్పుడు తమతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. బీజేపీని అవమానించేలా మాట్లాడారని.. ఇప్పుడు తమతో పొత్తుకు ఎలా పాకులాడుతున్నారో చెప్పాలన్నారు. తమ పార్టీని అవమానించిన వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా చేస్తామన్నారు. ప్రధాన మంత్రుల్ని మార్చే శక్తి ఉన్న, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు అప్పుడు రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే అన్నారు. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.


చంద్రబాబు అధికారంలో ఉంటే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయా అన్నారు. చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అందరికి తెలుసన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో హోంమంత్రి అమిత్‌ షాపై దాడి చేస్తే.. చంద్రబాబు వాళ్లపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి.. లేకుంటే పద్ధతిగా ఉండదు అంటూ హెచ్చరించారు. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలని.. ప్రతీ విషయంలో కేంద్రాన్ని విమర్శించటం సరికాదన్నారు. దమ్ముంటే.. చంద్రబాబు ముందుకు వస్తే ఒకే వేదికపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.


చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారని.. పొత్తులపై వారే నిర్ణయం తీసుకుంటారన్నారు. తమది మంచి సిద్దాంతాలు ఉన్న జాతీయపార్టీ అని.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నారు. తానే మాట్లాడే మాటల్లో తప్పులు ఉంటే చెప్పాలని.. చంద్రబాబు వస్తే ఆయన్నే అడుగుతాను అన్నారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అనుమతించకుంటే జగన్ పాదయాత్రలు చేసేవారా అంటున్నారని.. ఐదేళ్లు జగన్‌ను రోడ్లపై నడిపించారన్నారు.


నారా లోకేష్‌ తన పాదయాత్రలో రాయలసీమను అభివృద్ధి చేస్తామని హామీలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు వీర్రాజు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నా.. రాయలసీమకు ఏమీ చెయ్యలేదని ధ్వజమెత్తారు. మళ్లీ రాయలసీమను అభివృద్ధి చేస్తామంటే, ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో రోడ్లు వేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమని.. జగన్ సర్కార్ ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదన్నారు. రాష్ట్రంలో తాము అభివృద్ధి చేస్తే.. జగన్ సర్కార్ తమ స్టిక్కర్లు వేసుకుందన్నారు.


మరోవైపు బాపట్ల జిల్లా చీరాలలో సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా మాటేంటి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విశాఖ రైల్వే జోన్ ఏమైందని చీరాల అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అనంతరం జరిగిన సభలో జగన్ సర్కారుపై వీర్రాజు విమర్శలు చేశారు. కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్‌ జగన్ అవినీతి, అప్పులు చేసి సంక్షేమం అందిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa