ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనలా నోటికి ఏదొస్తే అది తాను మాట్లాడలేను,,,,సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 06:17 PM

వారాహి అనే లారీ ఎక్కి ఇష్టమొచ్చినట్లుగా.. నోటికి ఏదొస్తే అది తాను మాట్లాడలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో బుధవారం (జూన్ 28) ‘జగనన్న అమ్మఒడి పథకం’ కింద నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘పవన్ కళ్యాణ్‌లా తాట తీస్తాం, గుడ్డలూడదీస్తాం అంటూ నేను వ్యాఖ్యలు చేయలేను. మీసాలు మెలెయ్యలేను. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని, నాలుగేళ్లకోసారి భార్యలనూ మార్చలేను..’ అంటూ వైఎస్ జగన్ విమర్శల వర్షం కురిపించారు.


ఆ మనిషి నోటికి అదుపూ లేదూ, అత‌డికి నిలకడా లేదూ.. అంటూ పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు వైఎస్ జగన్. ‘ఈ ప్యాకేజీ స్టార్‌ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ.. తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు. తాట తీస్తా అంటాడు. దత్తపుత్రుడిలా మేం తొడలు కొట్టలేము. మీసాలు మెలెయ్యలేం. ఊగిపోతూ బూతులు తిట్టలేము. పెళ్లి అనే ప‌విత్రమైన బంధాన్ని రోడ్డున ప‌డేయ‌లేము. అవన్నీ వారికే చెందిన పేటెంట్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్.


‘చంద్రబాబు నాయుడు కోసమే 15 ఏళ్ల కింట ద‌త్తపుత్రుడు బ‌య‌ల్దేరాడు. 2014లో చంద్రబాబు, ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఇంటింటికీ త‌మ సంత‌కాల‌తో కూడిన మ్యానిఫెస్టోను పంపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లు తమ మ్యానిఫెస్టోను చెత్త బుట్టలో వేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం అలా కాదు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ అమలు చేశాం’ అని వైఎస్ జగన్ అన్నారు. హామీల‌ను నిల‌బెట్టుకోలేని చంద్రబాబును ద‌త్తపుత్రుడు ఏనాడైనా ప్రశ్నించాడా అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు మోసాల్ని ఆయ‌న పాలించిన ఐదేళ్లలో ఎందుకు ప్రశ్నించ‌లేద‌ని నిల‌దీశారు.


ప్రపంచాన్ని ఏలే స్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని 10 రోజుల పాటు పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. ‘ఒకటి నుంచి 12వ తరగతి దాకా చదివిస్తున్న 42,61,965 మంది అక్కాచెల్లెమ్మలకు, 83,15,341 మంది విద్యార్థులకు అండగా ఉంటూ మంచి చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అమ్మఒడి ద్వారా రూ. 6,392.94 కోట్లు విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa