ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వస్తుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని ప్రముఖ సినీ నటుడు సుమన్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయడమే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనడానికి కారణమని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో నటుడు సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరొకసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని.. వైసీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరిగిందని ఆ వర్గాల వారే చెప్తున్నారని సుమన్ తెలిపారు. నవరత్నాలు పథకాలను 95 శాతం అమలు చేసి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఇదిలావుంటే గతంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ ముందస్తు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సుమన్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తగ్గ తనయుడు జగన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా మంది ముఖ్యమంత్రుల పని తీరుని చూశానని.. కానీ, సంక్షేమ పథకాల అమలులో జగన్ తన తండ్రి వైఎస్సార్ని మించిపోయారని కొనియాడారు. సుమన్ కామెంట్స్ చూస్తుంటే.. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చన్న ప్రచారాలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa