ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. కాబట్టి, పొత్తుల గురించి ఆలోచించేందుకు టైమ్ ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వారాహి విజయయాత్ర కమిటీలతో శనివారం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలిసి వెళ్లాలా అనేది తర్వాత మాట్లాడే విషయమని స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మనం కష్టపడి పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని, నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు.
ఏలూరులో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మలిదశ వారాహి విజయయాత్రకు అందరూ సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం కళ్లారా చూశానని అన్నారు. ఈ పోరాటం వృథా కాదని.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ చూడాలంటే ఆ పార్టీ పతనం గోదావరి జిల్లాల నుంచే ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక్కడ ప్రారంభమైతేనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రజాకంటక పాలన విముక్తి చేయడానికి మనం ఎంత బలంగా ముందుకు వెళితే.. రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని పార్టీ శ్రేణులకు వివరించారు. వారాహి రెండో విడత యాత్ర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగసభతో యాత్ర ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa