పశ్చిమ్ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో 18 మంది మృతి చెందారు. ఈసారి ఎటువంటి హింసకు తావులేకుండా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను భారీగా మోహరించి ఎన్నికలను నిర్వహించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను వినియోగించినా హింసను నివారించలేకపోయాయి. బాంబు పేలుళ్లు, తుపాకుల మోత, కత్తిపోట్లు వంటి భయానక ఘటనలతో శనివారం బెంగాల్ దద్దరిల్లింది. బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, అది వీలుకాని చోట వాటికి నిప్పుపెట్టడం, నీళ్లు పోయడం వంటి దుశ్చర్యలకు దుండగులు పాల్పడ్డారు.
బెంగాల్లోని ఒకే దశలో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించగా.. ఫలితాలను మంగళవారం వెల్లడిస్తారు. ఇక, పోలింగ్కు ముందు రోజు రాత్రి నుంచే హింసాత్మక ఘటనలు మొదలయ్యాయి. దాడులు, ప్రతిదాడులూ క్రమంగా పలు జిల్లాలకు విస్తరించాయి. పోలింగ్ కేంద్రాల్లోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముర్షిదాబాద్, నదియా, కూచ్బిహార్ జిల్లాల్లో అత్యధికంగా, దక్షిణ 24 పరగణాలు, భంగర్, పుర్బామేదినీపుర్లలోని కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం జరిగింది. వివిధ ఘటనలో మొత్తం 18 మంది చనిపోగా.. వీరిలో అత్యధికంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన 12 మంది ఉన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ పోలింగ్ ఏజెంట్ హతమయ్యాడు.
కూచ్బిహార్ జిల్లా దిన్హాటాలో బ్యాలెట్ బాక్సులను దుండగులు ధ్వంసం చేసి, బ్యాలెట్ పత్రాలకు నిప్పంటించారు. ఓ యువకుడు ఏకంగా పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సును ఎత్తుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బర్నాచినా ప్రాంతంలో బ్యాలెట్ బాక్సుకు స్థానికులు నిప్పంటించారు. కేంద్ర రిజర్వు బలగాలను తమ ప్రాంతానికి పంపించాలని నందిగ్రామ్లో మహిళలు.. పోలీసు అధికారులను ఘెరావ్ చేశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం 63,000 మంది కేంద్ర రిజర్వు పోలీసులను, దాదాపు 70,000 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన జూన్ 8 నుంచి శనివారం వరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 35 మంది చనిపోయారు.
అయితే, మెజారిటీ బూత్లలో కేంద్ర బలగాలు లేకపోవడం, అస్తవ్యస్తమైన మోహరింపు శనివారం నాటి హింసకు ప్రధాన కారణం. ఎన్నికల కోసం 822 కంపెనీల బలగాలను పంపాలని కోరగా.. శనివారం పోలింగ్ ముగిసే సమయానికి 144 బెటాలియన్లు బెంగాల్కు చేరుకోలేదు. అయితే, బలగాలను సక్రమంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మోహరించకపోవడమే సమస్యలకు దారితీసిందని కేంద్రం దళాల సీనియర్ అధికారులు ఆరోపించారు. అయితే హింసను అరికట్టడంలో విఫలమైనందుకు బీజేపీతో సహా ప్రతి రాజకీయ పార్టీ బలగాలను నిందిస్తున్నాయి.
కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ కేంద్ర బలగాల కో-ఆర్డినెటర్కు బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కోర్టు ధిక్కార నోటీసును అందజేశారు. అలాగే, మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సువేందు విమర్శించారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa