ఏపీలో సరికొత్త మోసాన్ని బయటపెట్టారు తూనికలు, కొలతల శాఖ అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అధికారులు షాపుల్లో తనిఖీలు చేశారు. ప్రధానంగా కందిపప్పు, బియ్యం, నూనె విక్రయించే షాపుల్లో తనిఖీలు చేయగా.. కొన్ని మోసాలు బయటపడ్డాయి. తూకంలో మోసాలతో పాటుగా ప్యాకింగ్ ఉత్పత్తులపై ముద్రిత ధరలు కంటే ఎక్కువకు విక్రయించడం, ఎంఆర్పీలు ముద్రించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. కొన్ని షాపులపై కేసులు నమోదు చేశారు.
బాపట్ల జిల్లాలో తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. 25 కిలోల బియ్యం బస్తాను తూకం వేయగా కేజీ తగ్గింది. అంతేకాదు కిలో నూనె సంచిపై రూ.128 అమ్మకపు ధర ఉంటే.. అదనపు ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వస్తువులు కొనుగోలు సమయంలో సరకు వివరాలు, నాణ్యత, తూకం, ధ్రువపత్రాలు చూసుకోవాలని సూచించారు అధికారులు. కొందరు ముద్రలు లేని కాటాలను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. కొన్ని షాపుల్లో ఎమ్మార్పీ లేకుండా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. రైతులకు విక్రయిస్తున్న విత్తనాల బస్తాపై ఎమ్మార్పీ లేకపోవడంతో కేసులు నమోదు చేశారు.
మరోవైపు కొందరు వ్యాపారులు తూనికలు, కొలతల పరికరాలు, ఎలక్ట్రానిక్ కాటాల తయారీదారుల దగ్గరకు వెళ్లి 50 నుంచి 150 గ్రాముల వరకు తక్కువ తూగేలా సాఫ్ట్వేర్ను మార్చుకుంటున్నట్లు గుర్తించారు. అంతేకాదు మరికొందరు ఎలక్ట్రానిక్ యంత్రాలను రిమోట్ ద్వారా నిర్వహిస్తూ తూకం అక్రమాలకు పాల్పడుతున్నారు. బియ్యం వ్యాపారులు చేస్తున్న తూకం మోసాలతో వినియోగదారులు భారీగా నష్టపోతున్నారు. 25 కేజీల బస్తాకు కేజిన్నర వరకు తగ్గించి అమ్మేస్తున్నారు. అంతేకాదు మరికొందరు వ్యాపారులు రైస్ మిల్లుల వారితో ముందే మాట్లాడుకుని.. బస్తాలను నింపే సమయంలో కేజీ వరకు బియ్యాన్ని తగ్గిస్తున్నట్లు గుర్తించారు.
ఈ తనిఖీల్లో.. డిజిటల్ కాటాలో లీటరు మోడ్లో పెట్టి తూకం వేస్తే ఒక కేజీకి వంద నుంచి రెండొందల యాభై గ్రాముల వరకు బరువు తగ్గుతున్నట్లు తేలిందట. కూరగాయలు, నిత్యావసర వస్తువులు, మిగిలిన వస్తువులు విక్రయించేచోట ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఒక్కోసారి కేజీకి 800 గ్రాములే వస్తున్నాయట.. రిమోట్ సాయంతో సులువుగా మోసాలకు పాల్పడుతున్నారట.
తూనికలు, కొలతల యంత్రాలతో వ్యాపారాలు చేసేవారు కచ్చితంగా ప్రతి ఏటా ఆ శాఖ నుంచి ఆయా పరికరాలు సక్రమంగా ఉన్నట్లు స్టాంపింగ్ ఉండాలి. ఒకవేళ ఆ యంత్రాల్లో లోపాలు ఉంటే సరి చేయించుకోవాలి. తూకానికి పాత కేజీ రాళ్లు వినియోగించడతో పాటుగా.. తూకంలోని పళ్లెం కింద లోహపు వస్తువులు ఉంచి మోసాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు జనాలకు విక్రయించే ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, గడువు, తయారు చేసే సంస్థ అడ్రస్, ఎంఆర్పీలు కూడా ఉండటం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇలాంటి మోసాలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తున్నామని.. తూకం మోసాలపై ఎవరైనా ఫిర్యాదు పరిశీలించి చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. వ్యాపారులు కూడా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa