ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాలయసీల ద్రోహి సీఎం జగన్.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2023, 06:22 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి అజ్ఞానం, మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సాగునీటి ప్రాజెక్టులే ఉదాహరణ అని చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో.. సాగునీటి ప్రాజెక్టులు నాశనమైన తీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.


సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని.. ఈ ప్రాంతానికి చెందిన ప్రాజెక్టులకు సంబంధించి తీరని అన్యాయం చేశారని చంద్రబాబు అన్నారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్నందుకు సీఎం జగన్‌కు సిగ్గనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయన్నారు. రాయలసీమ అభివృద్ధి ఎన్టీఆర్ తీసుకొచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌తోనే ప్రారంభమైందని చెప్పారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలిపారు.


సాగునీటి ప్రాజెక్టులపై తెలుగు దేశం పార్టీ హయాంలో రూ. 68,293 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చంద్రబాబు చెప్పారు. ఇరిగేషన్ శాఖను వైసీపీ భ్రష్టు పట్టించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ప్రత్యేకించి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 12,441 కోట్లు ఖర్చు చేశామని.. వైసీపీ హయాంలో రూ. 2,011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు.


తెలుగు గంగకు టీడీపీ రూ. 504 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని చంద్రబాబు తెలిపారు. హంద్రీ - నీవా ప్రాజెక్టు కోసం టీడీపీ రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు పెడితే.. సీఎం జగన్ రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. గొల్లపల్లి ప్రాజెక్టును సైతం పూర్తి చేశామని.. అందుకే కియా ప్రాజెక్టు వచ్చిందని తెలిపారు. ఇదే సమయంలో రాజకీయ కక్షతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంకు నీరందించ లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి కమీషన్లపైన ఉండే శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టుల మీద లేదని దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లిస్తే రతనాలసీమగా మారుతుందని బాబు చెప్పుకొచ్చారు.


ఇక, రాయలసీమకు గుండెకాయలాంటి ప్రాజెక్టు ముచ్చుమర్రి అని చంద్రబాబు అన్నారు. అలాంటి ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేస్తే.. వైసీపీ కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఒక పక్క ప్రాజెక్టులు కట్టకుండా రాయలసీమకు అన్యాయం చేస్తూనే.. మరోవైపు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను రక్షించ లేకపోతున్నారని ధ్వజమెత్తారు. నిర్వహణ సరిగా లేక.. ఇసుక మాఫియాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని తెలిపారు.


ప్రీ - క్లోజర్ చేసిన 102 ప్రాజెక్టులు తిరిగి ప్రారంభిస్తామని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రీ- క్లోజర్ చేసేశారన్నారు. టీడీపీ హయాంలో కూడా కొన్ని ప్రాజెక్టులను ప్రీ- క్లోజర్ చేయమని చెప్పినా తాను అంగీకరించ లేదని గుర్తు చేశారు. లాభం లేకున్నా ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చామన్నారు. కానీ, ఐదేళ్ల వరకు ప్రాజెక్టులకు టెండర్లు పిలవద్దంటే.. అవి మూలన పడేయడం కాదా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రకటనల ఖర్చులు.. సలహాదారుల జీతాలతో కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే పరిస్థితి ఉందన్నారు. తాను మాట్లాడే దానికి వైసీపీ నేతలు సమాధానం చెప్పుకోలేక తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యారని వ్యాఖ్యానించారు. రాయలసీమకు, యువతకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో ప్రాంతంలో కులం పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కానీ, రాయలసీమలో ప్రశాంతత తెచ్చింది టీడీపీనే అని అన్నారు. ఏపీలో తుఫానును నివారించలేము.. కానీ, కరవును నివారించవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa