విశాఖపట్నంలో బుధవారం వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి విశాఖ మహానగరం అతలాకుతలమైంది. విశాఖలోని పూర్ణ మార్కెట్, చావులమదుం, స్టేడియం రోడ్డు, రైల్వే న్యూ కాలనీ, జ్ఞానాపురం, షీలా నగర్ సహా పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచే కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చావులమదుం రైల్వే వంతెన కిందకు భారీగా వరద నీరు రావడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్టేడియం రోడ్డు పూర్ణ మార్కెట్ ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగిపొర్లాయి. జ్ఞానాపురంలో మోకాలి లోతు వరకు వరద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు.
మరోవైపు ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడింది. బుధవారానికి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలపై నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావంతో మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు, తీరం వెంబడి 45 నుంచి 55.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మూడురోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa