నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్గా నిమయించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. కోటంరెడ్డి అధికారికంగా టీడీపీలో చేరలేదు.. కానీ కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు.
లోకేష్ పాదయాత్రకు ముందు టీడీపీ నేతలు కోటంరెడ్డిని కలిశారు. టీడీపీలోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దగ్గరుండి చూసుకున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అధికారికంగా పార్టీలో చేరకపోయినా సరే టీడీపీ అధిష్టానం ఆయనకు రూరల్ బాధ్యతల్ని అప్పగించింది.
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధికారికంగా టీడీపీలో చేరకపోయినా రూరల్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన రాకను వ్యతిరేకిస్తున్న.. మొన్నటి వరకు నెల్లూరు టీడీపీ ఇంఛార్జ్గా ఉన్న అబ్దుల్ అజీజ్తో సమావేశం అయ్యారు. అలాగే ప్రతి రోజూ డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించారు. అలాగే శ్రీధర్ రెడ్డి తాను వచ్చాక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నవారిని కూడా సమావేశాలకు ఆహ్వానించారు. 2024లో రూరల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కలిసి పనిచేద్దామని కోరారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్సీపీలో తనను అవమానించారని.. అలాగే తన ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు.. తనను అనుమానించిన పార్టీతో కలిసి నడిచేది లేదన్నారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారని వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేశారు. కొంతకాలానికి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పనులపై పోరాటాలు అంటూ నిరసనలకు దిగారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. ఆందోళనకు దిగారు.
కోటంరెడ్డికి నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగించడంతో అబ్దుల్ అజీజ్ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే కోటంరెడ్డి చేరికతో పాటూ ఇతర అంశాలపై ఇప్పటికే అధినేత చంద్రబాబు అజీజ్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. నేతలంతా సమన్వయంతో కలిసి ముందుకు సాగాలని సూచించారట. అటు నెల్లూరు సిటీలో కూడా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్థానంలో మాజీ మంత్రి నారాయణకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. టీడీపీకి 2019 ఎన్నికల్లో ఒక్కు సీటు కూడా గెలుచుకోలేదు.. ఈసారి మాత్రం మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa