ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్, ఆయుధాలు సరఫరా,,,నిజం ఒప్పుకున్న పాక్

international |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 09:49 PM

భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. పలుమార్లు యుద్ధం జరిగినా.. పాకిస్థాన్ బుద్ధి మారలేదు. అయితే ఇప్పటికీ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. పాకిస్థాన్ ఎన్ని కుట్రలు చేసినా సరిహద్దుల్లో, దేశం లోపల కూడా భారత సైన్యం వాటిని చిత్తు చేసి ప్రత్యర్థికి ఎదురుదెబ్బలు కొడుతూనే ఉంది. సరిహద్దుల్లో మాత్రం పాక్.. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. ఉగ్రవాదులను, ఆయుధాలను, చివరికి మత్తు పదార్థాలను కూడా సరిహద్దులు దాటించి భారత్‌లోకి పంపిస్తోంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్‌ను పాక్ పంపించడం.. సరిహద్దుల్లో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడూ వాటిపై కాల్పులు జరిపి వాటిని కూల్చివేయడం చూస్తూనే ఉన్నాం. చైనా అండతో పాకిస్థాన్ చేస్తున్న ఈ దురాగతాలకు సంబంధించి ఎన్నోసార్లు భారత సైన్యం ఆధారాలతో సహా బయటపెట్టింది. అయినప్పటికీ తమకేమీ సంబంధం లేదని పాక్ కొట్టిపారేసింది. తాజాగా ఆ దేశ ప్రధానికి అత్యంత సన్నిహితుడే వాటిని ఒప్పుకున్నాడు.


పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు రక్షణ సలహాదారుగా ఉన్న మాలిక్‌ మహమ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ మీడియా ముందు ఈ విషయాన్ని అంగీకరించాడు. పాక్‌ జియో న్యూస్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు హమీద్‌ మీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేయడంపై సంచలన విషయాలు వెల్లడించాడు. భారత్, పాక్ సరిహద్దుల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న స్మగ్లర్లు హెరాయిన్‌ను సరఫరా చేసేందుకు డ్రోన్లను వాడుతారని చెప్పారు. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ, పునరావాసం కల్పించకపోతే వారు కూడా స్మగ్లర్లతో చేరే అవకాశముందని ఈ సందర్భంగా మాలిక్‌ వెల్లడించారు. అదే సమయంలో భారత్‌కు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ జరుగుతుందా అని మాలిక్‌ను ఆ జర్నలిస్ట్ ప్రశ్నించారడు. దీనిపై స్పందించిన మాలిక్.. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న కాసౌర్‌ రేంజర్స్‌ ప్రాంతం.. చాలా సున్నితమైందని.. అక్కడ డ్రోన్లతో డ్రగ్స్ స్మగ్లింగ్‌ జరుగుతోందని ఒప్పుకున్నాడు. తాజాగా అక్కడ 2 సంఘటనలు జరిగినట్లు వివరించారు. 10 కిలోల హెరాయిన్‌‌తో కూడిన 2 డ్రోన్లు.. సరిహద్దు దాటి.. భారత్‌లోకి పంపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్టు మీర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారడంతో పాకిస్థాన్ బుద్ధి బయటపడిందని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.


భారత్‌, పాక్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌లలో ఇటీవలి కాలంలో డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు తరలిస్తున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. సరిహద్దుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండే బీఎస్ఎఫ్ బలగాలు ఈ డ్రోన్లను గుర్తించి.. వాటి నుంచి ఆయుధాలు, డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్న వార్తలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పాక్‌ నుంచి డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు కఠిన చర్యలు చేపడుతూనే ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa