ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన భారత్,,అమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్న జనం

international |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2023, 09:50 PM

బాస్మతి, ఉప్పుడు బియ్యం మినహా.. మిగితా సన్న బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలోనైతే సూపర్‌ మార్కెట్లలో జనం పోటెత్తుతున్నారు. బియ్యం ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించడంతో అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. అకస్మాత్తుగా బియ్యం డిమాండ్ పెరగడంతో అమెరికాలో వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. బియ్యం కోసం అమెరికాలో జనం నుంచి బాగా డిమాండ్ ఉందని సోషల్ మీడియాల్లో వీడియోలు వైరల్ కావడంతో బియ్యం కంపెనీలన్నీ ధరలను భారీగా పెంచేశాయి.


బియ్యం ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించిన తర్వాత అమెరికాలో ధరలు డబుల్ అయినట్లు తెలుస్తోంది. గతంలో 10 కిలోల బియ్యం బ్యాగు 18 డాలర్లు ఉండగా.. ఇప్పుడు 40 నుంచి 50 డాలర్లకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం సన్న బియ్యం ఎగుమతులపైనా నిషేధం ఉండగా.. బాస్మతీ బియ్యంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో బాస్మతీ బియ్యంపైనా నిషేధం విధించవచ్చని భావిస్తున్నరెస్టారెంట్లు ఇప్పటినుంచే బాస్మతి బియ్యాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.


మరోవైపు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంపట్ల ఇంటర్‌నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత తీవ్రం అయింది. దీనికి తోడు గత సీజన్‌లో భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా.. వరి పంట ఉత్పత్తి తగ్గిపోయింది. దీనికి తోడు ఈ ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యంగా పడటంతో ఈసారి కూడా పంట వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భావించిన భారత ప్రభుత్వం.. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ క్రమంలోనే భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందనే వాదన వినిపిస్తోంది.


భారత్ తీసుకున్న బియ్యం ఎగుమతుల నిషేధం నిర్ణయం ప్రపంచ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థిక వేత్త పియర్‌ ఒలివర్‌ గౌరించస్‌ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంక్షలను ఎత్తి వేయాలని కోరారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు ప్రతీకార చర్యలకు దారితీసే ప్రమాదం ఉందని పియర్‌ ఒలివర్‌ గౌరించస్‌ హెచ్చరించారు. భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే అమెరికన్లు సూపర్ మార్కెట్లకు పోటెత్తారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa