ఓ గ్రామ వాలంటీర్ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నానని.. బీసీ కోటాలు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే తనకు వాలంటీర్ కోటాలో తనకు టికెట్ ఇవ్వాలన్నారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపాకలో గురువారం ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ టిక్కెట్ బీసీ వాలంటీర్లకు కేటాయించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. వాలంటీర్ పాడి మహేష్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలో సీఎం జగన్ వాలంటీర్లకు ఎనలేని గౌరవం కల్పించారన్నారు మహేష్. 2024 ఎన్నికల్లో వాలంటీర్ల కోటాలో ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన తన తండ్రి గాడి నూకరాజు గ్రామ సర్పంచ్గా పనిచేశారన్నారు. తాను డిగ్రీ చదివిన తర్వాత పారుపాక వలంటీర్గా సేవలందిస్తున్నట్లు చెప్పారు. వాలంటీర్ కోటాలో ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ టికెట్ కేటాయిస్తే అత్యధికంగా బీసీలు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీలో విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేక సెగ మొదలైంది. ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ తన పట్ల నియంతలా వ్యవహరిస్తున్నారని రౌతులపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అధికారులు తన విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని.. అధికారులకు ఫోన్లు చేసినా 'మీరెవరు చెప్పడానికి' అని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే తమ మనుషుల్ని పెట్టుకొని పనులు చేస్తున్నారని.. మండలంలో ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలకు కూడా తనకు అహ్వానం పలకడం లేదన్నారు. అధికారులు, ఎమ్మెల్యే కనీసం తనను మనిషిగా కూడా చూడటం లేదని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రొటోకాల్ వ్యవహారంపై ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్కు పలుసార్లు ఫిర్యాదు చేశానని.. కలెక్టర్కు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదన్నారు ఎస్టీ మహిళా ప్రజా ప్రతినిధి కావడం వల్లే తన పట్ల ఇలా వ్యవహరిస్తున్నారన్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ప్రత్తిపాడు జడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజరాజేశ్వరి ఆరోపించడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. తననే కాదు, తన భర్త, తన కుమార్తె, తమ అనుచరులపై కక్షకట్టి అనేక కేసులు పెట్టించారని చెప్పారు. ఎమ్మెల్యే ఆగడాలపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామని జడ్పీటీసీ తెలిపారు.
అంతేకాదు గత ఏడాదిగా ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ తనను వేధిస్తున్నట్లు ఆరోపించారు ప్రత్తిపాడు జడ్పీటీసీ సభ్యురాలు బెహరా రాజరాజేశ్వరి. ఇటీవలే వాలంటీర్లు, అధికారులు, అనుచరులతో సమావేశాలు నిర్వహించారని.. తనతో పాటుగా పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న తన భర్త, తన మామ, కూతురు ప్రజల్లోకి వెళ్తే తరిమి కొట్టాలని తన అనుచరులకు ఇతర నాయకులకు పిలుపునిచ్చారన్నారు. తమపై దాడిచేసి.. అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. ఇలా ఎమ్మెల్యే అన్ని విధాలుగా ఇబ్బందిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa