గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ వెళ్లారు. ఏపీలో సంచలనం రేపిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి, సాక్షి పత్రికపై కోర్టులో లోకేష్ క్రిమినల్ కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా లోకేష్ జడ్జి ముందు శుక్రవారం హాజరయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి లోకేష్ న్యాయమూర్తి ఎదుట తన స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో లోకేష్ వాంగ్మూలాన్ని జడ్జి నమోదు చేసుకున్నారు.
లోకేష్ వస్తుండటంతో కోర్టు దగ్గరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో కోర్టు వద్ద సందడి నెలకొంది. లోకేష్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు కూడా కోర్టు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ లోకేష్ కోర్టు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
టీడీపీ హాయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని, నిధులు దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేయగా.. పలువురిని అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అరెస్ట్ కూడా చేసింది. సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్తో పాటు చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగల్వార్, సురేష్ గోయల్, కన్విల్కర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత వారందరూ బెయిల్పై బయటకొచ్చారు.
అయితే టీడీపీ ప్రభుత్వంలో ఈ స్కాం చోటుచేసుకోవడం, అప్పట్లో లోకేష్ మంత్రిగా ఉండటంతో ఇందులో లోకేష్ హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకురాలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి తనపై చేస్తున్న ఫేక్ ప్రాపగాండాపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టును లోకేష్ ఆశ్రయించారు. అలాగే చినబాబు చిరు తిండి పేరుతో సాక్షి వేసిన కథనంపై మంగళగిరితో పాటు విశాఖ కోర్టులో మరో పరువు నష్టం దావా వేశారు. తాను తప్పు చేయనని, అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోనంటూ లోకేష్ గతంలో వైసీపీ నేతలను హెచ్చరించారు.
బురద జల్లి వెళ్లిపోతానంటే ఊరుకునేది లేదని, నిరాధార ఆరోపణలు చేసినవారిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కాగా కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో నేడు పాదయాత్రకు లోకేష్ బ్రేక్ ఇచ్చారు. శనివారం నుంచి లోకేష్ పాదయాత్ర యథాతధంగా కొనసాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa