సూరత్ కోర్టు తనకు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టులో స్టే వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు. 2019 లోక్సభ ఎన్నికల వేళ.. మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే దాన్ని గుజరాత్ హైకోర్టులో సవాల్ చేయగా.. ఎదురుదెబ్బ తగిలింది. దీంతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఉపశమనం లభించింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి పడిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. తనకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎవరూ తనను ఆపలేరని వెల్లడించారు.
ఇవాళ లేదా రేపు లేకుంటే ఆ తర్వాత రోజు సత్యం, నిజం ఎప్పటికీ నిలుస్తుందని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తాను ప్రయాణించాలనుకుంటున్న గమ్యం సుస్పష్టంగా ఉందని పేర్కొన్నారు. తనకు సాయపడిన వారికి.. తనపై ప్రేమ, ఆప్యాయత కురిపిస్తూ.. మద్దతుగా నిలిచిన ప్రజల అందరికీ కృతజ్ఞుడినై ఉంటానని వెల్లడించారు. అంతకుముందు ఏం జరిగినా తన కర్తవ్యం కొనసాగుతుందని.. దేశాన్ని కాపాడే ఆలోచన అలాగే ఉంటుందని అంతకుముందు రాహుల్ ట్వీట్ చేశారు. ఏది జరిగినా తన కర్తవ్యం మాత్రం ఒకేలా ఉంటుందని.. దేశ సిద్ధాంతాలు, ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తన బాధ్యత అని ట్విటర్లో రాసుకొచ్చారు.
మరోవైపు.. రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇండియా కూటమిలోని పార్టీలు స్వాగతించాయి. రాహుల్ జైలు శిక్షను నిలిపివేయడం పట్ల తీవ్ర హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని.. కేంద్రంలోని మోదీ సర్కారుకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి విజయం లభించిందని పలువురు విపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకున్నారు. తీర్పు వెలువడిన తర్వాత పార్టీ ఆఫీస్కు వచ్చిన రాహుల్ గాంధీకి.. హస్తం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్షపై గురువారం స్టే విధించిన సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. రెండేళ్ల జైలు శిక్ష వేసేందుకు సరైన కారణాలు వెల్లడించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ప్రజాజీవితంలో ఉండేవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa