స్వచ్ఛంద సేవ అయిన శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సేవ కోసం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఆన్ లైన్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
శ్రీవారి సేవ ఆన్ లైన్ ద్వారా మాత్రమే కేటాయిస్తారని.. ఎవరైనా డబ్బులు తీసుకుని సేవ తీసిస్తామంటే భక్తులు నమ్మొద్దని చెప్పారు. సేవ సాప్ట్వేర్ కచ్చితంగా ఉంటుందని, టీటీడీ సర్వర్ను ఎవరూ హ్యాక్ చేయలేరన్నారు. శ్రీవారి సేవ చేస్తున్న మహిళలను గౌరవప్రదంగా అమ్మ అని పిలవాలన్నారు.సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్, లక్కీ డిప్ విధానం, తిరుమల సీఆర్వో వద్ద ఒకరోజు ముందుగా పేర్లను నమోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయించబడుతుంది అన్నారు. ఇది కాకుండా ప్రతిరోజు ఆన్లైన్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 15 వేలు, ఎస్ ఎస్ డి టోకెన్లు 15 వేలు, దివ్యదర్శనం టోకెన్లు 15 వేలు తిరుపతిలో కేటాయిస్తున్నారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుండి ఫ్రీ దర్శనానికి అనుమతిస్తామన్నారు.
ప్రతిరోజు అంగప్రదక్షిణకు 750 టికెట్లు ఇస్తున్నట్లు టీటీడీ ఈవోతెలిపారు. ఇందుకోసం భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండవలసి వస్తోందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నామన్నారు. తిరుమలలో ఆ రోజు భక్తుల రద్దీ దృష్ట్యా లెటర్ ద్వారా ఇచ్చే బ్రేక్ దర్శనాల సంఖ్యను తగ్గిస్తామన్నారు. తిరుమలలో డబ్బులు ఇవ్వొద్దని.. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ధర్మ రథాలు ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు వస్తుందని.. బస్ స్టాప్స్ దగ్గర ఆపుతారన్నారు.
తిరుపతి జిల్లాను క్యాన్సర్ రహితప్రాంతంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం కోసం ఒక పింక్ బస్సును ఆధునిక వైద్యపరికరాలతో జిల్లా యంత్రాంగానికి విరాళంగా అందిస్తామన్నారు. అలాగే గూడూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తిల్లో క్యాన్సర్ నిర్ధారిత కేంద్రాలకు మరో పింక్ బస్ అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలాగే స్విమ్స్లో మరో పింక్ బస్ ఏర్పాటు చేస్తామని.. టాటా క్యాన్సర్ ఆసుపత్రికి కూడా ఒక పింక్ బస్ అందిస్తామన్నారు.
స్విమ్స్లో త్వరలో లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో. అలాగే స్విమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం రాష్ట్రంలో మరెక్కడా లేని హెచ్పిబి (హెపటో పాంక్రియాటో బిలియరీ) సర్టిఫికేట్ కోర్సును నిర్వహిస్తోంది అన్నారు. ఎయిమ్స్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంటరాలజీ చదువుతున్న ఫైనలియర్ విద్యార్థులు ఈ కోర్సును అభ్యసిస్తున్నారన్నారు. 50 సీట్లు ఉన్నాయని.. వీరికి ప్రముఖ వైద్యులతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa