ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలిపిరి మెట్ల మార్గంలో షెడ్డు ఏర్పాటు,,,చివరి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 07:12 PM

ఇవాళ జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.4 కోట్లతో అలిపిరి కాలిబాట మార్గంలో భక్తుల సౌకర్యార్థం షెడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మోకాలు మెట్టు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు షెడ్ నిర్మించనుంది. రూ.2.22 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డులో చార్జింగ్ స్టేషన్, రూ.2.5 కోట్లతో యాత్ర సముదాయం-1 ఆధునీకరణ చేపట్టనుంది. అలాగే రూ.24 కోట్లతో రెండు ఘాట్‌రోడ్లలో రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.


రూ.4.5 కోట్లతో టీటీడీ ల్యాబ్ ఆధునీకరణ, తిరుచానూరు పద్మావతి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్, రూ.75.86 కోట్లతో చిన్నపిల్లల ఆస్పత్రిలో పరికరాలు, రూ.3 కోట్లతో శ్రీనివాసం కాంప్లెక్స్ వద్ద సబ్‌వే ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. ఇక రూ.3.10 కోట్లతో శ్రీనివాస మంగాపురం ఆలయం, రూ.9.85 కోట్లతో వకుళమాత ఆలయం అభిృద్ది చేయాలని నిర్ణయించింది. అలాగే శ్రీనివాస సేతు నిర్మాణ పనులకు రూ.188 కోట్ల నిధులు కేటాయించగా.. రూ.5 కోట్లతో ఎస్వీ యూనివర్సిటీలో అభివృద్ది పనులు చేపట్టనుంది. స్వామివారీ కైంకర్యాలు, ప్రసాదాల తయారీ కోసం రూ.4.25 కోట్లతో నెయ్యి ప్లాంట్ నిర్మించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.


ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో అభివృద్ది పనులు, రూ.2.2 కోట్లతో రుయా హాస్పిటల్‌లో టీబీ వార్డు, రూ.11 కోట్లతో ఎస్వీ మ్యూజిక్ కాలేజీలో హాస్టల్ భవనం పనులను చేపట్టాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎస్వీ సంగీత కాలేజీ అభివృద్ది కోసం రూ.11 కోట్లు, వేశాలమ్మ, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ది కోసం రూ.1.25 కోట్లు, టీటీడీ ఆస్తులను పరిరక్షించేందుకు 69 స్థాలాలకు కంచె ఏర్పాటు చేయడానికి రూ.1.25 కోట్ల నిధులు కేటాయించారు. టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పదవీకాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపారు. రేపటితో ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ముగియనుంది. దీంతో చివరి సమవేశంలో భక్తులకు ఉపయోగపడేలా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


సమావేశం ముగిసిన అనంతరం తీసుకున్న నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10న టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనుండగా.. అనంతరం పాలకమండలి సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నారు. రేపటితో వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగుస్తుండటంతో.. ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ బోర్డు సమావేశమైంది. చివరి సమావేశం కావడంతో అనేక అంశాలపై చర్చించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa