ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం ముంపు గ్రామాల ప్రజలతో జగన్ ముఖాముఖి,,,రూ.5 లక్షల పరిహారం ఇస్తామని వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 07:15 PM

ఇవాళ పోలవరం ముంపు గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడిన జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతోందని, తాము కాదని తెలిపారు. పోలవరాన్ని తాము కట్టి ఉంటే ముందు మీ గురించి ఆలోచించి ప్రాజెక్ట్ కట్టేవాళ్లమని ముంపు గ్రామాల ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది కాబట్టి వాళ్లు చెప్పినట్లు చేయాల్సిందేనని తెలిపారు. వైఎస్సార్ హయాంలో 45 వేల ఎకరాల భూసేకరణ జరిగిందని, అప్పుడు భూములు ఇచ్చినవారికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు.


గతంలో ఇచ్చిన లక్షన్నరకు అదనంగా మరో రూ.3.5 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. రూ.5 లక్షల పరిహారం ఇస్తామన్న మాటలకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. పోలవం ప్రాజెక్టులో మూడు దశల్లో నీళ్లు నింపుతామని, నీళ్లు నింపేనాటికి పూర్తిగా ఆర్‌అండ్‌ఆర్ ఇస్తామని చెప్పారు. ఆర్‌అండ్ఆర్ దశలవారీగా పూర్తవుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లు ప్లానింగ్ లేకుండా కట్టారని, కాఫర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం వల్లే అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వం స్పిల్‌వే కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టిందన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం వల్లనే అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు.


లిడార్ సర్వేను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ఎప్పుడు ఏ బాధ వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ భరోసా కల్పించారు. ఆర్‌అండ్‌ఆర్ ఒక్కటే వేగంగా చేయలేకపోయామని, ఆర్‌అండ్ఆర్ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. ప్యాకేజీ కింద కేంద్రం రూ.6.8 లక్షలు ఇస్తోందని. తమ ప్రభుత్వం తరపున రూ.3.2 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలకంటే భిన్నంగా వరదల సమయంలో బాధితుల్ని ఆదుకుంటున్నామని, సహాయక చర్యల్లో కలెక్టర్లకు అన్ని అధికారాలు ఇచ్చామన్నారు. 2013-14 రేట్లతో ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తామని, చంద్రబాబు చేసిన నిర్వాకం వల్లనే ఇదంతా జరిగిందన్నారు.


తమ ప్రయత్నాలతో కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని, అనుకున్న విధంగా పనులు వేగంగా పూర్తి చేయలేకపోయామని జగన్ తెలిపారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిర్ణయించామని, సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులో కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని జగన్ స్పష్టం చేశారు. కాగా ఇవాళ ఏలూరు జిల్లాలోని గొమ్ముగూడెంలో వరద బాధితలతో జగన్ మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa