ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుంగనూరు దాడుల కేసులో టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు కోసం గాలింపు,,,ఆరు ప్రత్యేక బృందాలు కేటాయింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 08:12 PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకున్న దాడుల వ్యవహారంలో మరో తొమ్మది మంది అరెస్ట్ అయ్యారు. పోలీస్ వాహనాలు, పోలీసులపై దాడి చేసినందుకు వీరిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 72 మందిని అరెస్ట్ చేయగా.. ఈ కేసులో A1 నిందితుడుగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.


చల్లా బాబు ఆచూకీ కోసం ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. దీంతో ఆయన కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. దాడి జరిగిన రోజున ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఉన్న చెక్ పోస్ట్‌లతో పాటు టోల్ గేట్ల వద్ద సీసీ కెమెరాలు ద్వారా వాహనాల వివరాలు సేకరిస్తున్నారు. అలాగే అనంతపురం, బెంగళూరుతో పాటు రాయచోటి ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో విచారణను మరింత వేగవంతంగా చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఏలూరు పర్యటనలో ఉన్న చంద్రబాబును చల్లా బాబు కుటుంబసభ్యులు ఇవాళ కలిశారు. చల్లా బాబు సోదరి వీణ, కుమార్తె పూజ కలిశారు. పార్టీ అండగా ఉంటుందంటూ వారికి చంద్రబాబు ధైర్యం కల్పించారు. ఈ సందర్బంగా పలు విషయాలపై వారితో చర్చించారు.


ఇటీవల రాయలసీమలోని ప్రాజెక్టులను సందర్శించేందుకు వివిధ జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సాగింది. ఈ సందర్బంగా పుంగనూరులో చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా.. ఆయన పర్యటనను వైసీపీ నేతలు అడ్డుకోవడం, రాళ్ల దాడికి పాల్పడటంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురుదాడికి దిగడం, తమపై లాఠీఛార్జ్ చేస్తున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగడం, పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టడంతో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా దాడులకు దిగడంతో పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు.  రాయలసీమ పర్యటనలో భాగంగా అనేక ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో పనులు పూర్తిగా నిలిచిపోయాయని, తమ ప్రభుత్వంలోనే పనులు వేగవంతంగా చేపట్టామని తెలిపారు. తిరిగి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa