కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంటులోకి సోమవారం అడుగుపెట్టారు. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో విధించిన శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. తిరిగి ఎంపీగా కొనసాగనివ్వాలని సూచించింది. దీంతో రాహుల్ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియట్ పునరుద్ధరించడంతో దాదాపు 4 నెలల తర్వాత సభకు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నేతలు, ఇతర ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఆయనను పార్లమెంటులోకి ఆహ్వానించారు. తిరిగి ఎంపీగా సభ్యత్వం రావడంతో రాహుల్ గాంధీ ట్విటర్ బయోలో ఆయన మార్పులు చేశారు.
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ బహిరంగ సభలో మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ.. చేసిన వ్యాఖ్యల కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టు ఆయనకు మార్చి 23 వ తేదీన రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మార్చి 24 వ తేదీన రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీనికి సంబంధించి లోక్సభ సెక్రటేరియట్.. సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంతో రాహుల్ పార్లమెంటులో అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే పార్లమెంట్కు వచ్చిన రాహుల్కు మద్దతుగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులు రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధరీ స్వీట్లు తినిపించుకున్నారు.
అయితే ఈ సందర్భంగా రాహుల్ తన ట్విటర్ బయోను మార్చారు. మార్చి 24 వ తేదీన వయనాడ్ ఎంపీగా ఉన్న ట్విటర్ బయోను డిస్క్వాలిఫైడ్ ఎంపీగా మార్చారు. తాజాగా తన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో మరోసారి మార్పు చేశారు. ఇప్పటివరకు డిస్క్వాలిఫైడ్ ఎంపీగా రాహుల్ ట్విటర్ బయోను తాజాగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మార్చుకున్నారు. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి మణిపూర్ అంశంపై వాయిదాలతోనే సభలు నడుస్తుండగా.. తాజాగా విపక్షాల నిరసనలతో లోక్సభ మరోసారి వాయిదా పడింది. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం లభించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని సెలబ్రెట్ చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa