ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూసీసీకి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం

national |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2023, 07:40 PM

ఒకే దేశం.. ఒకే చట్టం అనే నినాదంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశపెట్టాలని చూస్తోంది. అయితే దేశంలోని వివిధ పార్టీలు, వర్గాలు, సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. మరికొన్ని వర్గాలు, పార్టీలు, సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళ.. ఈ ఉమ్మడి పౌరస్మృతిపై సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలపైనా గతంలో కేరళ ప్రభుత్వం.. శాసనసభలో తీర్మానాలను ప్రవేశపెట్టింది.


ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి కేరళ శాసనసభ ఆమోదం తెలిపింది. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యుల నుంచి ఏకగ్రీవంగా మద్దతు లభించింది. ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌పై మోదీ సర్కార్ చేస్తున్న హడావుడి తొందరపాటు చర్యగా అభివర్ణించారు. యూసీసీని అమలు చేయడం అంటే భారత రాజ్యాంగంలో ఉన్న లౌకిక వాద భావనను ధ్వంసం చేయడమేనని పేర్కొన్నారు. మనుస్మతిని రాజ్యాంగంగా భావించే సంఘ్ పరివార్‌.. భారత రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ అమలు చేయాలనుకుంటున్న ఉమ్మడి పౌరస్మృతి.. రాజ్యాంగంలో పేర్కొన్న ఉమ్మడి పౌరస్మృతి ఒకటి కాదని ఆరోపించారు.


2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో నెలకొన్న అనేక సమస్యల నుంచి బీజేపీపై దేశప్రజల దృష్టిని మరలించేందుకే యూసీసీ అంశాన్ని తెరపైకి తెస్తోందని విజయన్ మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44.. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేయడానికి మాత్రమే ప్రతిపాదిస్తుందని.. అది కాలక్రమేణా వివిధ మతాలకు చెందిన సంస్థలతో ఏకాభిప్రాయం, చర్చల ద్వారా మాత్రమే అమలు చేయాలని సూచిస్తోందని గుర్తు చేశారు. దేశ పౌరులు తమ చట్టాలను ఎంచుకునే హక్కులను గౌరవించడం ద్వారా మాత్రమే పార్లమెంటు ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదించాలని.. ప్రజలను ఒత్తిడి చేయవద్దని అంబేడ్కర్ చెప్పినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా గతంలో కేర‌ళ అసెంబ్లీ తీర్మానాలు చేసింది. సీఏఏకు వ్య‌తిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రంగా కేర‌ళ‌ నిలిచింది.


ఇప్పటికే ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై లా కమిషన్‌, న్యాయ మంత్రిత్వ శాఖలు కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని జూన్ 14 వ తేదీనే కేంద్రం నోటీసులు జారీ చేసింది. దేశంలోని ప్రజలందరికీ ఒకటే రాజ్యాంగం ఉంది. కానీ వేర్వేరు మతాలకు సివిల్ చట్టాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. వివాహం, వారసత్వానికి సంబంధించి మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో మతానికి ఒక్కో రకమైన చట్టాలు ఉన్నాయి. దేశ ప్రజలందరికీ ఒకేరకమైన సివిల్ చట్టాలు అమలు చేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే దీనిపై సుదీర్ఘ కాలంగా దేశంలో భిన్నాభిప్రాయాలు, వివాదాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa