టీడీపీ అధినేత చంద్రబాబు సహా 20మంది నేతలపై అన్నమయ్య జిల్లాలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులు నమోదు చేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. అధినేత చంద్రబాబు, తాను, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి విజయనగరంలోనే ఉన్నామన్నారు. కేసులకు భయపడేది లేదని.. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.
రాష్ట్ర పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి . చంద్రబాబు సహా తామంతా విజయనగరంలోనే ఉన్నామని.. దమ్ముంటే వచ్చి అరెస్టు చేసుకోవాలని సవాల్ చేశారు. ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తేవాలని జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారని.. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ వాళ్లే దాడులు చేస్తున్నారన్నారు. తిరిగి కేసులు మాత్రం తమపై పెడతున్నారని ధ్వజమెత్తారు. ఆ దాడులకు పోలీసులే సాక్ష్యమని.. వారికి కూడా దెబ్బలు తగిలాయన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని.. ప్రజల కోసం జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కేసుల్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు.
మరోవైపు ఈ కేసు వ్యవహారంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. పుంగనూరు, అంగళ్లులో రచ్చ చేసి, దాడులకు ఉసిగొల్పి.. చంద్రబాబుపై కేసు నమోదు చేయించడం ఆత్మన్యూనతకు అద్దం పడుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు చేపట్టిన యుద్ధభేరితో జగన్ వెన్నులో వణుకు మొదలైందన్నారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రోడ్ షోలకు వస్తున్న జనాధరణ చూసి అసహనంతో తప్పుడు కేసులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ చేస్తున్న ఈ పిల్ల చేష్టలు చూస్తుంటే జాలేస్తోందన్నారు.
తెలుగుదేశం పార్టీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ర్యాలీలు, ధర్నాలకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. జెండాలు పట్టుకుని రెచ్చగొట్టింది ఎవరు? పులివెందులలో కారులో వచ్చి రెచ్చగొట్టి, టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో వైఎస్సార్సీపీ నేతలు తోక ముడిచారన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న ఉత్సాహం, చంద్రబాబు సభలకు, లేవనెత్తిన అంశాలకు ప్రజల నుండి మెరుగైన స్పందన వస్తుండడంతో.. ఏం చేయాలో తెలియని స్థితిలో దాడులకు తెగబడుతున్నారన్నారు. దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులపై కేసులు పెట్టడం వీరికే దక్కిందన్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. ఎంత మందిని అరెస్టు చేస్తావో చేసుకో అన్నారు. బాధింపబడిన ప్రతి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని.. న్యాయం చేస్తుందన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒంటి నుంచి చిందిన ప్రతి రక్తపు బొట్టుకూ బదులు చెప్పితీరాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa