రాజస్థాన్లోని భిల్వారా సామూహిక హత్యాచార ఘటనపై కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మానవత్వపు అన్ని పరిమితులను దాటేసిందని, ఏ నాగరిక సమాజం ఇటువంటి చర్యలను ఆమోదించబోదని వ్యాఖ్యానించారు. భిల్వారాలో 14 ఏళ్ల మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడిన దుండుగులు.. చంపేసిన తర్వాత బొగ్గుల కొలిమిలో పడేసి అత్యంత హేయంగా వ్యవహరించారు. అనంతరం సగం కాలిన శరీర భాగాలను ఓ చెరువులో పడేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది.
బుధవారం బాధిత కుటుంబాన్ని సచిన్ పైలట్ పరామర్శించారు. ‘మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను ఏ నాగరిక సమాజంలోనూ ఆమోదించలేం.. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు మానవత్వం హద్దులు దాటారు.. ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన వారు మానవత్వపు హద్దులు దాటిపోయారు’ అని సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేశారు "నేను బాధితురాలి బంధువులను కలిశాను.. నిందితులందరినీ అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోబోతున్నారని తెలుసుకున్నాను... కోర్టులో ప్రతిరోజూ విచారణ నిర్వహించి పోక్సో కేసు ఛార్జ్ చేస్తామని అధికార యంత్రాంగం నాకు సమాచారం ఇచ్చింది.. వారిపై కఠిన చర్యలు తీసుంటారు’ అని పైలట్ తెలిపారు. దీనికి ముందు ఆగస్టు 6న నలుగురు సభ్యుల బీజేపీ మహిళా ఎంపీల కమిటీ కూడా బాధిత కుటుంబాన్ని కలిసింది.
కాగా, గుర్తుపట్టలేని విధంగా లభ్యమైన బాలిక మృతదేహానికి కుటుంబసభ్యులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సమయంలో ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమార్తెకు జరిగిన దారుణాన్ని భరించలేకపోయాడు. ఆమెతో పాటు తాను కూడా కాలిపోయేందుకు చితిలోకి దూకాడు. అయితే, అక్కడ ఉన్నవారు వెంటనే అతడిని బయటికి లాగడంతో ప్రాణాపాయం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa