ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకున్నారా,,,పెళ్లి గురించి స్మృతి ఇరానీకి నెటిజన్ ప్రశ్న

national |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 09:33 PM

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ ప్రశ్నల సెషన్‌లో చాలామంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం ఇచ్చారు. మీరు మీ ఫ్రెండ్ భర్తను పెళ్లి చేసుకున్నారా అని సదరు నెటిజన్ ప్రశ్న వేశాడు. దీనికి కేంద్రమంత్రి ఘాటుగా రిప్లె ఇచ్చారు.


స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా అని డైరెక్ట్‌గా నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. అలాంటిదేమీ లేదని ఆమె కొట్టిపారేశారు. తన భర్త జుబిన్ ఇరానీ మాజీ భార్య మోనా.. వయసులో తన కంటే 13 ఏళ్లు పెద్దదని స్మృతి ఇరానీ చెప్పారు. అందువల్ల మోనా తన బాల్య స్నేహితురాలు అయ్యే ఛాన్స్ లేదు కదా అని తెలిపారు. ఈ సందర్భంగా మోనా రాజకీయ నాయకురాలు కాదని.. అందుకే ఆమెను రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తనతో పోరాడాలి కానీ సంబంధం లేని మోనాను గౌరవించండి అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. టీవీ రంగం నుంచి తన కెరీర్ మొదలు పెట్టిన స్మృతి.. ఇప్పుడు భాజపాలో కీలక నేతగా ఎదిగారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సెషన్‌లో ఆమె తనకు ఇష్టమైన ఆహారం, ప్రాంతాలు.. ఇలా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. స్మృతి ఇరానీ 2001లో జుబిన్ ఇరానీని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అంతకు ముందు జుబిన్‌కు మోనాతో వివాహమైంది.


సోషల్ మీడియాలో తనకు తరచూ ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతుంటాయని తెలిపిన స్మృతి ఇరానీ.. జుబిన్ ఇరానీ, మోనా గురించి పూర్తిగా తెలిపారు. ఈ సందర్భంగా తనకు మోనాతో ఎలాంటి సంబంధం లేదని.. తాము స్నేహితులు కాదని స్పష్టం చేశారు. జుబిన్‌ ఇరానీని.. 2001లో స్మృతి ఇరానీ వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు జోర్, కుమార్తె జోయిష్‌ ఉన్నారు. అయితే జుబిన్‌ ఇరానీకి అంతకుముందే మోనాతో పెళ్లి జరిగింది. వారిద్దరికి షానెల్లే అనే కుమార్తె ఉంది. ఇదే సెషన్‌లో పలువురు నెటిజన్లు.. స్మృతి ఇరానీ టీవీ లైఫ్‌ గురించి కూడా ప్రశ్నలు వేశారు. రీల్‌ లైఫ్‌ను మిస్ అవుతున్నారా అని అడిగిన ఓ నెటిజన్ ప్రశ్న వేయగా.. అప్పుడు ఆ లైఫ్ చాలా అద్భుతంగా అనిపించిందని.. కానీ ఎప్పటికీ అది అలాగే ఉంటుందని చెప్పలేమన్నారు.


ఇటీవల లోక్‌సభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సభ నుంచి బయటికి వెళ్తూ.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ ఎంపీలు ఆరోపణలు చేశారు. దీనిపై సభ నుంచి రాహుల్ వెళ్లిన తర్వాత కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ సంస్కారం అదేనని.. మహిళలను ఆయన కించపరుస్తూనే ఉంటారని ఆమె మండిపడ్డారు. రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వచ్చాయి. స్నేహితురాలి భర్తను ఆమె బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నారని నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa