తిరుమలలో ఇటీవల చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు మరికొన్ని వన్య ప్రాణులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. నడకమార్గంలో భక్తులకు క్రూరమృగాలు కనిపిస్తుండటంతో భయాందోళనకు గురై వెంటనే పరుగులు పెడుతున్నారు. ఇటీవల తిరుమలలో చిరుతల దాడిలో లక్షిత అనే చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో టీటీడీ మరింత అప్రమత్తమైంది. భక్తుల భద్రతకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. నడకమార్గంలో భక్తులపై పలు ఆంక్షలు విధిస్తోంది.
ఈ క్రమంలో నడకమార్గంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడకమార్గంలోని తినుబండారాల దుకాణాల్లో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించవద్దని షాపుల యజమానులకు సూచించింది. భక్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువులకు వేస్తున్నారు. ఈ జంతువుల కోసం క్రూరమృగాలు వస్తున్నట్లు టీటీడీ భావిస్తోంది. దీంతో నడకమార్గంలోని దుకాణాల్లో పండ్లు, కూరగాయలు భక్తులకు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. అలాగే అన్ని దుకాణాల వద్ద తడి, పొడి చెత్తను వేర్వేరుగా చెత్తకుండీల్లో వేయాలని టీటీడీ సూచించింది. అలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిది.
నేడు తిరుపతిలోని పరిపాలనా భవనంలో పోలీస్, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు దుకాణాల నిర్వాహకులతో ఈవో ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. ధర్మారెడ్డి మాట్లాడుతూ.. నడక మార్గంలో రోజుకు రెండు నుండి మూడు టన్నుల చెత్త పోగవుతోందని, వీటిని క్రమం తప్పకుండా తొలగిస్తున్నట్లు చెప్పారు. నడకమార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా క్రూరమృగాల కదలికలను గుర్తిస్తామని తెలిపారు. వాటి జాడ భక్తులకు కనిపిస్తే వెంటనే సమాచారం అందించేందుకు అటవీ, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారుల ఫోన్ నంబర్లు ప్రదర్శిస్తామన్నారు. నడకమార్గాల్లో తినుబండారాలు విక్రయించే దుకాణదారులు తప్పకుండా ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలు పాటించాలని ధర్మారెడ్డి సూచించారు. భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అందరి సూచనలు తీసుకుంటామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa