ఇటీవలి కాలంలో విమానాల్లో ప్రయాణికులు, విమాన సిబ్బంది, పైలట్ల వ్యవహార శైలి తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. విమానంలో ప్రయాణిస్తూ వికృత చేష్టలకు పాల్పడుతూ తోటి వారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోవడంతో విమానాల్లో ప్రయాణించాలంటేనే కొంత మంది భయపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి విమానంలోని క్యాబిన్ సిబ్బందితోపాటు తోటి మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వారిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ ప్రయాణికుడి వ్యవహారాన్ని విమానంలోని మిగితా ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాల్లో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. దీంతో మహిళా కమిషన్ స్పందించింది.
ఢిల్లీ నుంచి ముంబై బయల్దేరిన స్పైస్జెట్ విమానంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానంలోకి ఎక్కిన ప్రయాణికుడు ఫ్లైట్ టేకాఫ్ కాగానే.. లైంగిక వేధింపులకు దిగాడు. విమానంలోని క్యాబిన్ సిబ్బందితోపాటు అందులోని పలువురు మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం అసభ్యకరమైన రీతిలో వారి ఫొటోలు, వీడియోలను తీస్తూ వారికి నరకయాతన కలిగించాడు. అయితే ఆ ప్రయాణికుడు చేస్తున్న చేష్టలతో విసిగిపోయిన మిగితా ప్రయాణికులు.. ఆ వ్యక్తిని వీడియో తీశారు. దాన్ని కాస్త సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.
అయితే విమానం ముంబైలో దిగిన తర్వాత విమానంలోని సిబ్బంది, ప్రయాణికులు ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు వచ్చి ఆ ప్రయాణికుడి సెల్ఫోన్ పరిశీలించారు. అందులో విమాన సిబ్బంది, ఇతర మహిళా ప్రయాణికులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై సుమోటోగా ఫిర్యాదు స్వీకరించింది. దీనిపై ఢిల్లీ పోలీసులకు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసు ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతోపాటు ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ఇచ్చిన నోటీసులకు సంబంధించిన ఫోటోలను.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ట్విటర్లో షేర్ చేశారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల గురించి అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఎవరైనా ఫిర్యాదు చేశారా అని ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ను ప్రశ్నించింది. ఈ ఘటనలో నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగింది. ఒకవేళ ఆ ప్రయాణికుడిపై ఎలాంటి ఫిర్యాదులు అందకుంటే.. దానిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఆగస్టు 23 వ తేదీలోగా ఢిల్లీ పోలీసులు, డీజీసీఏ తమ నివేదికలను సమర్పించాలని ఢిల్లీ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa