ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల సూసైడ్లకు చెక్‌పెట్టేందుకు కోటాలో కొత్త రకం ఫ్యాన్లు

national |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 09:05 PM

రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఇటీవల తరచూ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఉంటున్న హాస్టల్ గదుల్లో ఉన్న ఫ్యాన్ల స్థానంలో కొత్తరకం స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకే స్థానిక అధికార యంత్రాంగం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హాస్టళ్లలో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వివిధ రకాలైన కాంపిటేటివ్ టెస్ట్‌లు, ఎంట్రన్స్ టెస్ట్‌లు రాసే విద్యార్థులు చాలామంది కోటా జిల్లాకు వస్తూ ఉంటారు. అయితే ఇటీవల స్టూడెంట్స్ సూసైడ్లు పెరిగిపోవడంతో అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు.


అయితే ఈ ఏడాది ఇప్పటివరకే కోటా జిల్లాలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విద్యార్థుల సంఖ్య 20 కి చేరడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐఐటీ, జేఈఈ, నీట్‌ సహా వివిధ ఎంట్రన్స్‌ టెస్టులకు ప్రిపేర్ అయ్యేందుకు ఏటా లక్షల మంది అక్కడ కోచింగ్ తీసుకుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది స్టూడెంట్స్ కోచింగ్‌ల కోసం కోటా జిల్లాకు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో 20 మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకోగా.. వీటిని అడ్డుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత 8 ఏళ్లతో పోలిస్తే ఈసారి కోటాలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉండటం తీవ్ర సంచలనంగా మారింది.


ఈ సందర్భంగా విద్యార్థుల ఆత్మహత్యలు అడ్డుకునేందుకు కోటా జిల్లా అధికార యంత్రాంగం గతవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సూసైడ్ చేసుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది రూమ్‌లలోని ఫ్యాన్లకు ఉరి వేసుకుంటున్నారని గుర్తించారు. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ రూముల్లో ఉన్న ఫ్యాన్లను వెంటనే తొలగించాలని కోటా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఫ్యాన్ల స్థానంలో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను బిగించాలని సూచించారు. ఈ ఫ్యాన్లపై బరువు పడినపుడు సీలింగ్‌ నుంచి విడిపోయి కిందికి వేలాడుతుంది. అప్పుడు విద్యార్థుల కాళ్లు భూమిని తాకి ఉరి పడకుండా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం కోటాలోని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్‌ రూమ్‌లలో ఈ ఫ్యాన్లను బిగించడం మొదలు పెట్టారు. మరోవైపు.. చదువులో ఒత్తిడి కారణంగా విద్యార్థులు చనిపోతున్నారనే విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ కోచింగ్ సెంటర్లకు కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలని తెలిపారు. ఒక క్లాస్ రూమ్‌లో 80 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని నిబంధనలు విధించారు. ఈ ఆదేశాలను పాటించని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే రూమ్‌లలో ఫ్యాన్లు మార్చడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. కొత్త రకం ఫ్యాన్లను బిగించినంత మాత్రాన విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకోలేమని.. వారిపై ఉండే చదువు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa